మరోసారి ప్రారంభమైన బోటు వెలికితీత పనులు... ఇప్పుడైనా బయటకు వచ్చేనా...?
తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ప్రమాదంలో చిక్కుకున్న బోటును బయటకు తీసేందుకు మరోసారి ధర్మాడి సత్యం బృందం తన ప్రయత్నాలు ప్రారంభించింది. వరద ఉదృతి తగ్గడంతో రెండవసారి వెలికితీతకు తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించిన సామాగ్రిని కచ్చులూరుకు తరలించింది. కాగా గతంలో మూడు రోజుల పాటు లంగర్లు వేసి బోటును వెలికితేసేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం లభించలేదు. అయితే బోటు వెలికితత ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే గోదావరిలో వరద ఉదృతి పెరిగింది. దీంతో పనులను తాత్కాలికంగా నిలిపి వేశారు.
ఇక రెండవసారి ప్రయత్నాల కోసం ఆదివారమే జిల్లా కలెక్టర్ను కలిసి అనుమతి కోరింది. మంగళవారం నుండి బోటును తీయనున్నట్టు జిల్లా అధికారులకు సమాచారం అందించింది. సాంప్రదాయ పద్దతిలో బోటును వెలికితీసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలోనే ధర్మాడి సత్యం బృందం తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. కాగా బోటు వెలికితీత ప్రయత్నాలు చేస్తున్న సంధర్భంలోనే బోటు ప్రమాదంలో మృతిచెందిన మరో రెండు మృతదేహాలు ధవళేశ్వరం ప్రాజెక్టు వద్దకు కొట్టుకు వచ్చాయి.
సెప్టెంబర్ 15న జరిగిన బోటు ప్రమాద సమయంలో 8 మంది సిబ్బందితో పాటు ముగ్గురు పిల్లలు సహా మొత్తం 75 మంది ఉన్నాట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. ఇప్పటి వరకు 38 మృతదేహాలను బయటకు తీశారు. కాగా మరో 11 మంది ఆచూకీ తెలియలేదు. బోటులోనే వారి డెడ్బాడీలు చిక్కుకొని ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో సత్యం బృందం బోటును వెలికి తీస్తే కాని మృతదేహాల జాడపై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు.