వైసీపీ ప్లీనరీలో బొమ్మిడాల పులుసు, మటన్ థమ్బిర్యానీ, తాపేశ్వరం కాజా..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడోసారి, అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్న ప్లీనరీని విజయవంతం చేయాలనే పట్టుదలతో అధిష్టానం ఉంది. అందుకు తగ్గ సూచనలు, ఆదేశాలు పార్టీ శ్రేణులకు అందాయి. ఈనెల 8, 9 తేదీల్లో గుంటూరు-విజయవాడ మధ్య పెదకాకాని సమీపంలో ప్లీనరీ జరగనుంది.
ప్లీనరీకి వచ్చే అతిథులకు ఆతిథ్యంలో ఎటువంటి లోటు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు భోజనాలు ఏర్పాటు చేశారు. 2 లక్షల 50వేల మందికి 250 కౌంటర్లు ఏర్పాటు చేశారు. శాఖాహారం, మాంసాహార వంటలతోపాటు తాపేశ్వరం కాజా, బ్రెడ్ హల్వా తదితర వంటకాలు అతిథులను నోరూరించబోతున్నాయి.
మటన్ థమ్ బిర్యానీ, చికెన్ రోస్ట్, రొయ్యల కూర, బొమ్మిడాల పులుసు, చేపల పులుసు, బ్రెడ్ హల్వా, తాపేశ్వరం కాజా, బంగాళదుంప కూర, చపాతీ, కోడిగుడ్లు, వెజిటబుల్ బిర్యానీ, ఉల్లి పచ్చడి, పెరుగు పచ్చడి, వైట్ రైస్, ఆవకాయ, నెయ్యి మెనూగా ఉన్నాయి.
రెండురోజులపాటు జరిగే ప్లీనరీతో ఉదయం 10.00 గంటల నుంచి రాత్రి 10.00 గంటల వరకు జాతీయ రహదారిపై వాహనాలను దారి మళ్లించారు. ఒంగోలు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు త్రోవగుంట, చీరాల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, హనుమాన్ జంక్షన్ మీదగా ప్రయాణించాల్సి ఉంటుంది. గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు తెనాలి, రేపల్లె, అవనిగడ్డ, హనుమాన్ జంక్షన్ చేరుకోవాలి.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు మీదగా ఇబ్రహీంపట్నం చేరుకుంటాయి. చెన్నై వైపు వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ, అవనిగడ్డ మీదగా చీరాల, ఒంగోలుకు చేరుకుంటాయి.