రివ్యూ: బోనాలు, బతుకమ్మ ప్రభుత్వ పండుగలు
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమైన బోనాలు, బతుకమ్మ పండుగలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించనుంది. ప్రభుత్వ పండుగలుగా ప్రకటిస్తూ కొద్ది రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ విషయాన్ని ఎక్సైజ్శాఖ మంత్రి పద్మారావు వివరాలు వెల్లడించారు. బోనాలు, రంజాన్ పండుగలకు సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
పలువురు మంత్రులు, తెరాస, బిజెపి, ఎంఐఎం ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్తో కలిసి మంత్రి పద్మారావు మీడియాకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రానున్న బోనాలు, రంజాన్ పండుగలను రంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు మంత్రి చెప్పారు.
ప్రభుత్వం ఈ పండుగలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తుందన్నారు. రంజాన్ పండుగకు ముఖ్యమంత్రి కెసిఆర్ రూ.5 కోట్లు మంజూరు చేశారని, ఈ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారన్నారు. విద్యుత్ కోతల వల్ల అంతరాయం కలగకుండా మందిరాలు, మసీదుల వద్ద మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మరికొన్ని చోట్ల భారీ జనరేటర్లను అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి పద్మారావు తెలిపారు.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు. దీనిపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు సమీక్ష సమావేశాలు నిర్వహించాలని, దేనికి కేటాయించిన నిధులను దానికే ఖర్చు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. బోనాలు, బతుకమ్మ పండుగలను ఈ ఏడాది నుంచే ప్రభుత్వ పండుగలుగా నిర్వహించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని మంత్రి చెప్పారు. వివిధ శాఖల అధికారులతో కలిసి జంటనగరాల్లో విస్తృత ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు.