‘జగన్! జగదాంబ సెంటర్ ఓకేనా?..అప్పుడు లోటస్ పాండ్లో చొక్కా చించుకున్నారుగా.!’
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును విశాఖ పర్యటనలో వైసీపీ నేతలు అడ్డుకోవడం, పోలీసులు అరెస్ట్ చేసి వెనక్కి పంపడంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో వైఎస్ జగన్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న జగన్ సర్కారు తీరుపై మండిపడ్డారు.

జగదాంబ సెంటర్లో తేల్చుకుందామా?
విశాఖపట్నంలో వైఎస్ జగన్ భూ కబ్జాలు బయటపడతాయనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అడ్డుకున్నారని బోండా ఉమ ఆరోపించారు. జగన్ రౌడీయిజానికి భయపడేది లేదని అన్నారు. విశాఖ జగదాంబ సెంటర్లో తేల్చుకుందాం అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉమ సవాల్ విసిరారు.

మరోసారి అడ్డుకోండి చూద్దాం..
త్వరలోనే చంద్రబాబు విశాఖపట్నం వస్తారని, అప్పుడు అడ్డుకోండి చూద్దాం అని వైసీపీ సర్కారుకు ఆయన మరో సవాల్ విసిరారు. గురువారం పోలీసుల అండతోనే రౌడీయిజం చేశారని మండిపడ్డారు. విశాఖలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన తీరుపై కోర్టుకెళ్తామని అన్నారు. విశాఖ ఘటనపై శుక్రవారం గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

అప్పుడు లోటస్ పాండ్లో చొక్కా చించుకున్నారుగా..?
విశాఖలో చంద్రబాబు అరెస్టుపై విజయసాయి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. పోలీసులపై, సీబీఐపై జగన్ చేసిన విమర్శలను ఆయన గుర్తు చేశారు. ‘ఏ చట్టం కింద నన్ను చంచల్ గూడా జైలు కి తీసుకెళ్లారు ?ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ అని లోటస్ పాండ్లో చొక్కా చించుకున్నారు గుర్తులేదా? చంద్రబాబు గారు అడిగింది ప్రజల్లోకి వెళ్లకుండా ఆపడానికి ఏ చట్టం ఉంది' అని బుద్ధా వెంకన్న నిలదీశారు.
Recommended Video


జగన్లా దొంగతనం చేసి కాదు విజయసాయి...
‘వైఎస్ జగన్ గారిలా దొంగతనం చేసి దొరికిపోయి ఏ చట్టం కింద జైలుకి తీసుకెళ్తున్నారు అని అడగలేదు విజయసాయి రెడ్డి.. ఆనాడు పెట్టుబడులు రాకుండా ఉత్తరాంధ్ర ని దెబ్బతియ్యడానికి వెళ్లారు జగన్ గారు. ఇప్పుడు జిఎన్ రావ్ కమిటీతో అడ్డమైన రాతలు రాయించి పెట్టుబడులు తిప్పి పంపుతున్నారు' అని బుద్ధా వెంకన్న దుయ్యబట్టారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా చంద్రబాబు గురువారం విశాఖకు వెళ్లగా అక్కడ వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఆ తర్వాత పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేసి హైదరాబాద్కు పంపారు.












Click it and Unblock the Notifications