బెజవాడలో అడుగు పెడితే, దద్దమ్మ: కేసీఆర్పై ఉమ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు బోండా ఉమమహేశ్వర రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్ కూడా తయారు చేయడం చేతకాని దద్దమ్మ కేసీఆర్ అని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ రైతులకు ఐదు రూపాయల రుణమాఫీ కూడా చంద్రబాబు ప్రభుత్వం చేయలేదని, ఈ విషయంపై అవసరమైతే విజయవాడలో సభ పెట్టి మాట్లాడుతానన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఉమ తీవ్రంగా స్పందించారు. విజయవాడలో అడుగు పెడితే, కేసీఆర్ భాషలో చెప్పాలంటే బొంద పెడతామన్నారు.
తెలంగాణలో ఎన్నో సమస్యలున్నా, పరిష్కరించడం చేతగాని సన్నాసి కేసీఆర్ అన్నారు. ఒకవైపు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిలో గొడవ పడుతూ, మరొకవైపు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరపకుండా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును కేసీఆర్ అంధకారం ముంచెత్తుతున్నారని ఆరోపించారు.
ఐదు నెలల నుంచి తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదని, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే కేసీఆర్కు బుద్ధి చెబుతారన్నారు.
ఇద్దరు సీఎంలతో సమావేశం నిర్వహించాలని హరీష్ రావు
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆదివారం ఢిల్లీ వెళ్లారు. తక్షణమే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించి శ్రీశైలం నీరు, విద్యుత్ వివాదాన్ని పరిష్కరించాలంటూ ఆయన హస్తినకు వెళ్లారు. ఆయన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలుస్తారు. కృష్ణా జలాల వినియోగంలో ఏపీ సర్కారు పలు నియమాలను ఉల్లంఘిస్తోందని పిర్యాదు చేయనున్నారు. శ్రీశైలం బోర్డు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకునేలా చేయాలని కోరనున్నారు.
వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుపై కేసీఆర్ సంతకం
తెలంగాణలో తీవ్ర విద్యుత్ కొరతను నివారించేందుకు రంగంలోకి దిగిన కేసీఆర్ సోమవారం ఆ ఘట్టాన్ని పూర్తి చేయనున్నారు. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఛత్తీస్గఢ్కు వెళ్లిన కేసీఆర్... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్తో ఆదివారమే చర్చలు జరిపారు. తెలంగాణ ప్రతిపాదనకు రమణ్ సింగ్ సర్కారు కూడా సరేననడంతో ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందం నేడు కుదరనుంది.