రంగా విగ్రహంపై చెయ్యేస్తే: ఉమ, 'టిడిపితో టచ్లో ఉత్తరాంధ్ర వైసిపి ఎమ్మెల్యేలు'
విజయవాడ: దివంగత నేత వంగవీటి రంగా విగ్రహాల జోలికి వస్తే ఊరుకునేది లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆదివారం నాడు హెచ్చరించారు. మచిలీపట్నంలో రంగా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
దీనిపై బోండా ఉమ తీవ్రంగా స్పందించారు. రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. కాపులు సంయమనం పాటించాలని, ఎలాంటి అలజడులు సృష్టించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాపుల అభివృద్ధికి మేధావుల సలహాలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తామన్నారు.
జగన్ వేధింపులు భరించలేకే టిడిపిలోకి: కళా వెంకట్రావు
వైసిపి అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వేధింపులు భరించలేకనే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. ఉత్తరాంధ్రలో పలువురు వైసిపి ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ఏపీ లోటు బడ్జెట్లో ఉందని, అయినా అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు.
అమరావతిలో వచ్చే అసెంబ్లీ సమావేశాలు: నారాయణ
జూన్ 15వ తేదీలోగా తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. తొలి విడదలో 4,500 మంది ఉద్యోగులు తరలి వస్తారని చెప్పారు. మరో రెండు భవనాల నిర్మాణాలకు ప్లాన్ సిద్ధం చేశామని, వచ్చేవారంలో అసెంబ్లీ భవన నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు. అమరావతిలోనే వచ్చే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు.