వెంకయ్యకు ఆ రోజు తెలియదా: ఎపికి ప్రత్యేక హోదాపై బొత్స ప్రశ్న
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రశ్నలు సంధించారు. ఎపికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని వెంకయ్య నాయుడు రాష్ట్ర విభజన సందర్భంగా డిమాండ్ చేశారని, ఇప్పుడు ఆ విషయం పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చలేదని వెంకయ్య చెబుతున్నారని, సుదీర్ఘ అనుభవం ఉన్న వెంకయ్యనాయుడికి ఆ విషయం అప్పట్లో తెలియదా అని ఆయన అన్నారు.
కేంద్రంలో బిజెపి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు ఏర్పడి 15 నెలలు కావస్తున్నా ప్రత్యేక హోదా హామీని పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రులు తలో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ప్రజల హక్కు అని ఆయన అన్నారు. బిజెపి ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకోవాలని ఆయన కోరారు.
రాష్ట్రాన్ని కాంగ్రెసు ప్రభుత్వం అడ్డగోలుగా విభజించిందని, విభజన చట్టంలో ఎన్నో అంశాలున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి అన్నారు. ఈ అంశాల్లో ఒక్కటిరెండైనా చంద్రబాబు అడిగారా అని ఆయన ప్రశ్నించారు.
సెక్షన్ 8 గురించి ప్రస్తావించడం తప్ప చంద్రబాబు ప్రజలకు అవసరమైన ప్రాజెక్టుల గురించి, ఇతర హామీల గురించి చంద్రబాబు ఒక్కసారి కూడా అడగలేదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు.