లోకేష్ డైరెక్షన్ లోనే విశాఖ భూదందా!.. ఏకమై తరిమి కొట్టాల్సిందే: బొత్స
విశాఖ భూదందాపై ప్రజలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సందర్భంగా బొత్స పొలుపునిచ్చారు. మన ఇల్లు, మన ఆస్తులు మనమే కాపాడుకోవడానికి ఇక పోరాటం చేయాల్సిందేనన్నారు.
విజయవాడ: విశాఖ భూదందాపై ఎప్పటినుంచో తీవ్ర ఆరోపణలున్నా.. ప్రభుత్వం మాత్రం భూ బకాసురలను చూసీ చూడనట్లుగా వదిలేస్తోందన్న ఆరోపణలున్నాయి. సామాన్యుల భూములను సైతం కొంతమంది బడాబాబులు కబ్జా పెడుతుండటంతో దీనిపై భారీ ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
రాజకీయ నేతలే ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు స్వయంగా ఆరోపించగా.. ఆ నేతలు అధికార పార్టీకి చెందినవారేనని వైసీపీ ఆరోపిస్తోంది. తాజాగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఇదే అంశంపై మీడియాతో మాట్లాడారు. ఏపీ పంచాయితీరాజ్ శాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలోనే విశాఖలో భూదందా జరుగుతోందని ఆయన ఆరోపించారు.
తాను పుట్టి ఇంతవాడినైనా.. ఇన్నేళ్లలో విశాఖలో ఇంత పెద్ద భూదందా చూడలేదని అన్నారు. భూదందాల వల్ల విశాఖ భూములకు విలువ కూడా పడిపోయే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రజల భూములను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. ప్రభుత్వం మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదని, ఎవరిని కాపాడటానికి ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తున్నారని బొత్స ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు, వారి చుట్టాలు పక్కాలు కలిసి దోచుకుతింటున్నారని ఫైర్ అయ్యారు.
విశాఖ భూదందాపై ప్రజలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సందర్భంగా బొత్స పొలుపునిచ్చారు. మన ఇల్లు, మన ఆస్తులు మనమే కాపాడుకోవడానికి ఇక పోరాటం చేయాల్సిందేనన్నారు. ఇలాంటి దోపిడీకి పాల్పడుతున్నవారిని తరిమితరిమి కొట్టాలని సూచించారు. ఈ మొత్తం దందాపై సీబీఐతో విచారణ జరపితేనే నిజాలు బయటకు వస్తాయని, బహిరంగ విచారణ ద్వారా ఒరిగేదేమి ఉండదని బొత్స స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications