చంద్రబాబే దుష్టశక్తులను జొప్పించారు: చంద్రబాబుపై బొత్స, అంబటి ఎదురుదాడి
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా తుని సంఘటనలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు కాపు ఉద్యమంలోకి చంద్రబాబు నాయుడే దుష్టశక్తులను జొప్పించి తుని దౌర్జన్యకర ఘటనలకు కారణమయ్యాడని, ఇందుకు పూర్తి బాధ్యత చంద్రబాబుదేనని ఆయన అన్నారు.
ఉద్యమాల్లోకి దుష్టశక్తులను జొప్పించి నీరు గార్చడం చంద్రబాబుకు అలవాటేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా అలాగే చేశారని అన్నారు. ఎక్కడ ఏం జరిగినా వైయస్ జగన్పై అభాండాలు ేవయడం ఏ మాత్రం సరి కాదని అన్నారు.
జీతాలు చెల్లించడానికి నిధులు లేనందువల్ల రూ.100 కోట్లు కేటాయించానని చంద్రబాబు చెప్పడం విడ్డూరమని అన్నారు. విజయవాడ, హైదరాబాద్ మధ్య తిరగడానికి ప్రత్యేక విమానాల కోసం వందలాది కోట్లు వెచ్చించారని, ఇష్టానుసారం ఆడంబరాలకు ఖర్చు చేస్తూ కాపులకు ఇవ్వడానికి నిధులు లేవని చెప్పడం ఏమిటని అన్నారు.
పుష్కరాలు, పట్టిసీమ, చంద్రన్న కానుక పేరుతో వందల కోట్లు తగిలేసిన ముఖ్యమంత్రికి కాపులకు ఇవ్వడానికి నిధులుండవా అని ఆయన అడిగారు. తునిలో జరిగిన సంఘటనలకు పూర్తి బాధ్యత చంద్రబాబుదేనని అన్నారు. ఎన్నికల ప్రణాళికలో నిర్ణీత కాలవ్యవధిలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు మాట ఇచ్చి అమలు చేయనందువల్లనే ఆ వర్గంలో ఆశాంతి చెలరేగిందని అభిప్రాయపడ్డారు.

కాపుల సంక్షేమానికి ఏడాదికి వంద కోట్లు ఇస్తామని చెప్పి గత 20 నెలల కాలంలో రూ. 100కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆయన విమర్శించారు. పైగా చంద్రబాబుతో సహా అందరూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడమే తప్ప తామున్నామంటూ ముఖ్యమంత్రి గానీ మంత్రులు గానీ కాపులకు నచ్చజెప్పి వారిలో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేయలేదని ఆయన అన్నారు. తునిలో జరిగిన సంఘటనలు దురదృష్టకరమని అన్నారు.
సంయమనం పాటించాలని తమ పార్టీ అందరినీ కోరుతోందని చెప్పారు. కాపు గర్జన జరిగిన ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతం ఎక్కువగా వ్యవసాయాధారితమని, చంద్రబాబు విధానాలపై అక్కడి రైతుల్లో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. అన్ని రకాల అసంతృప్తులూ తుని సంఘటనలకు కారణమయ్యాయని అన్నారు.
తుని సంఘటనలకు తన వైఖరే కారణమని చంద్రబాబు గుర్తించకుండా ఇంకా ఈ ఘటనలను రాజకీయం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. కాపుల రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్నవారు సంయమనం పాటించాలని ఆయన కోరారు.
కాపులకు ఇవ్వడానికి నిధులు లేవని సాకులు చెబుతున్న చంద్రబాబు నాయుడికి పారిశ్రామికవేత్తలకు రూ.2,500 కోట్ల సబ్సిడీ బకాయిలు చెల్లించడానికి మాత్రం డబ్బులున్నాయా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన విధంగా ఏటా వేయి కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు వంద కోట్లే కేటాయించి జీతాలకు డబ్బులు లేవని చెబుతారా అని అడిగారు.
ఈ పరిస్థితి తెలియకుండానే చంద్రబాబు హామీలు ఇచ్చారా అని అడిగారు. పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ చెల్లించి 400 కోట్ల రూపాయలు దోచుకోలేదా అని రాంబాబు ప్రశ్నించారు. రాజధాని శంకుస్థాపనకు రూ.400 కోట్లు దుబారాగా ఖర్చు చేయడానికి. ప్రత్యేక విమానాల్లో తిరగడానికి మాత్రం డబ్బులున్నాయా అని అన్నారు.
విచ్చలవిడిగా అయినదానికి కానిదానికి వేల కోట్ల రూపాయలు తగలేస్తున్న చంద్రబాబు కాపుల వద్దకు వచ్చేసరికి నీతులు చెబుతున్నారని ఆయన విమర్శించారు. తునిలో జరిగిన సంఘటనలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. ఈ ఘటనలకు అధికార తెలుగుదేశం పార్టీ అందరిపైనా ఆరోపణలు చేసే బదులు అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని అంబటి సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications