మోడీతో చంద్రబాబు భేటీ అందుకునేమో: బొత్స సంచలన వ్యాఖ్యలు
గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కాబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో చంద్రబాబు ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రయోజనాలు ఢిల్లీలో తాకట్టు పెట్టి కేవలం స్వప్రయోజనం కోసమే చంద్రబాబు మోడీని కలుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపి, టీడిపిల మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించేందుకు, తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు విచారణకు రాకుండా మోడీని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు కలుస్తున్నారని ఆయన అన్నారు.
జన్మభూమిలో పూర్తి వ్యతిరేకత
రాష్ట్రంలో పరిపాలన ఆశ్చర్యకరంగా ఉందని బొత్స వ్యాఖ్యానించారు. జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజలను పూర్తి వ్యతిరేకత ఎదురవుతోందని ఆయన అన్నారు. ఇప్పటికే పది లక్షల దరఖాస్తులు వచ్చాయని, ప్రభుత్వం పోలీసులను పెట్టి దౌర్జన్యం చేసి జన్మభూమి నిర్వహిస్తోందని ఆయన అన్నారు.
వైఎస్ హయాంలో ఇల్లు...
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇళ్లు లేని లక్ష మందికి ఇళ్లు కట్టించి ఇచ్చామని, గుడిసెలు లేని రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డామని బొత్స చెప్పారు. మూడున్నరేళ్లు గడిచినా చంద్రబాబు ప్రభుత్వం ఒక్క ఇల్లయినా కట్టించి ఇచ్చిందా అని ప్రశ్నించారు.
కల్తీ కేంద్రంగా గుంటూరు..
గుంటూరు కల్తీ కేంద్రంగా తయారైందని, ఆ కల్తీలో మత్రులూ అధికారల పాత్ర ఉందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆయన గురువారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కిడ్నీ రాకెట్కు కూడా గుంటూరు కేంద్రంగా మారిందని ఆయన అన్నారు. కిడ్నీ రాకెట్పై సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
అవినీతి చట్టబద్దమైన కార్యక్రమంగా...
రాష్ట్రంలో అవినీతి చట్టబద్దమైన కార్యక్రమంగా మారిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. జన్మభూమి విజ్ఞప్తులను కట్టలు కట్టి పక్కన పడేస్తున్నారని ఆయన అన్నారు. రైతులను మోసగించి, తప్పుదోవ పట్టిస్తున్న టిడిపి ప్రభుత్వం ఆత్మవంచన చేసుకుని పాలన సాగించవద్దని ఆయన అన్నారు.