వ్యాపారాలు చేస్తూ దండుకుంటున్నారు: బాబుపై బొత్స
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాలతో పాటు వ్యాపారాలు చేస్తూ ప్రజల సొమ్మును చంద్రబాబు దండుకుంటున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ధ్వజమెత్తారు. అవినీతిని పెంచి పోషించింది చంద్రబాబు నాయుడేనని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు అవినీతికి పేటెంట్ తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతి ఆరోపణలు వస్తే కోర్టులకు వెళ్లి విచారణలు జరగకుండా చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నారని ఆయన అన్నారు. చంద్రబాబుకు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ఆయన అడిగారు. రెండు ఎకరాల నుంచి రెండు వేల కోట్లు చంద్రబాబు సంపాదించారని రాష్ట్రం కోడై కూస్తోందని ఆయన అన్నారు.
అవినీతిని రూపుమాపుతానని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. నీతికి మారు పేరు అయినట్లు చంద్రబాబు మాట్లాడడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. ప్రజలు అమాయకులని, తెలివిలేనివారని, విషం పెట్టినా తినేవారని చంద్రబాబు అనుకుంటున్నారని బొత్స వ్యాఖ్యానించారు.
జనవరి 3న ఆస్తులు ప్రకటిస్తా
తెలుగుదేశం పాలనలో మేలు చేశామని చంద్రబాబు చెప్తే ఫరవా లేదని, కానీ ఆ విషయం చెప్పరని ఆయన అన్నారు. కాంగ్రెసు అధికారం కోసం చూడలేదని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేసిందని ఆయన అన్నారు. చంద్రబాబుకు ప్రజల్లో విశ్వాసం పోయిందని ఆయన అన్నారు. జనవరి 3వ తేదీన తన అస్తుల వివరాలను ప్రకటిస్తానని బొత్స చెప్పారు. ఎన్నికల సమయంలో నాయకులు పార్టీలు మారడం సహజమేనని కూడా ఆయన అన్నారు.
చంద్రబాబు రామబాణం కాదని, భస్మాసుర హస్తమని ఆయన అన్నారు. తమ పార్టీ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి పార్టీని వీడి వెళ్లిపోతానంటే సంతోషమని ఆయన వ్యాఖ్యానించారు.