యనమల మానసిక పరిస్థితిపై బొత్సకు డౌట్: ‘పరిటాల భయంతో పారిపోయారు’
హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 'యనమలకు మానసిక పరిస్థితి సరిగానే ఉందా? రాష్ట్రం అప్పుల్లో ఉంటే రెండంకెల వృద్ధి ఎలా వచ్చింది?' అంటూ విరుచుకుపడ్డారు.
టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగుదేశం నేతలు, తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
ఈ క్రమంలోనే బొత్స సత్యనారాయణ టిడిపి నేతపలై మండిపడ్డారు. మోసం చేసే వారిని ప్రజలు సహించరన్న ఉద్దేశంతోనే జగన్ గురువారం ఆ వ్యాఖ్యలు చేశారన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.
నవ్యాంధ్ర రాజధాని భూమలును బినామీలకు అమ్ముకున్నారని, టీడీపీ నేతలు సిగ్గు లేకుండా ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారని, టీడీపీ నేతల మానసిక స్థితి బాగుందా? లేదా? అని బొత్స ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికలను కూడా వ్యాపారదృష్టితో చూస్తున్నారని టీడీపీ సీనియర్ నేతలే వ్యాఖ్యానించారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
'కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పేషీ నుంచి ఫోన్ కాల్స్పై ఏం బాధ్యత వహించారు? అసలు అప్పారావు ఎవరు? అప్పారావు ఎవరితో లాలూచీ పడ్డారు? ఇవన్నీ పక్కన పెట్టారు. ఎవరిపై చర్యలు లేవు. కనీసం, అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారా?' అని బొత్స ప్రశ్నించారు. ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు మాట్లాడటం లేదని బొత్స ఆరోపించారు. టీడీపీ నేతలకు వ్యవస్థలపై గౌరవం లేదని అన్నారు.
ఎవరికీ భయపడేది లేదు, జేసీ బ్రదర్సే భయపడ్డారు: అనంత
తెలుగుదేశం నేత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం అనంతపురంలో మాట్లాడుతూ.. తమకు డబ్బులు, పదవులు, కాంట్రాక్టులు అవసరం లేదని అన్నారు.
తాము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతోనే ఉంటామని తెలిపారు. పరిటాలకు భయపడి బెంగళూరుకు పారిపోయిన చరిత్ర జేసీ దివాకర్ రెడ్డి సోదరులదేనని అన్నారు. తామెప్పుడూ ఎవరికీ భయపడమని స్పష్టం చేశారు.