నోరు మెదపలేదు: హోదాపై కేంద్రమంత్రులను ఏకేసిన బొత్స
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రుల తీరుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని పార్లమెంటులో స్వయంగా కేంద్ర మంత్రి ప్రకటించినా రాష్ట్రానికి చెందిన మంత్రులు నోరు మెదపకపోవడం శోచనీయమని ఆయన అన్నారు.
ఆ ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తించదని చెబుతున్న మంత్రులు అదే కేంద్ర మంత్రితో వివరణ ఎందుకు ఇప్పించడం లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఎన్డీయె మాట మార్చిందని ఆయన దుయ్యబట్టారు.
తమ ఉద్యమంలో రాజకీయ స్వార్థం లేదని, టిడిపి రాజకీయ స్వార్థంతో వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఎపి హక్కు అని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రోజుకో ప్రకటన చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ప్రత్యేక హోదాపై నిపుణుల కమిటీ వేస్తారని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. పార్లమెంటు సుప్రీమా, ఫైనాన్స్ కమిషన్ సుప్రీమా అని ఆయన అడిగారు. ప్రత్యేక హోదా సాధించే విషయంలో టిడిపి ఏం చేస్తోందని, ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉందా అని ఆయన అడిగారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే రాజకీయాలను పక్కనపెడతామని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా కోసం ఏ పార్టీ కలిసొచ్చినా కలుపుకెళతామని చెప్పారు. ఐదు వేల మందితో ఎల్లుండి ఢిల్లీలో జగన్ దీక్ష జరుగుతుందని బొత్స తెలిపారు.
సీపీఎం, సీపీఐ నేతలతో జగన్ మాట్లాడారనీ, జగన్ దీక్షకు సీపీఎం, సీపీఐ మద్దతు పలికాయని అన్నారు. రాజకీయ వ్యాపారంలో టీడీపీ ప్రత్యేక హోదాను మరిచిందని, అందుకే తాము ముందుండి ఉద్యమాన్ని నడిపించాల్సి వస్తోందని ఆయన అన్నారు. పవన్ అధికారపక్షమో, ప్రతిపక్షమో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.