కేటీఆర్తో జగన్ భేటీ, టీఆర్ఎస్తో పొత్తు: నీ మాటేమిటి... చంద్రబాబుకు రోజా దిమ్మతిరిగే కౌంటర్
అమరావతి: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కలయికపై దుష్ప్రచారం సాగుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ గురువారం అన్నారు. 175 స్థానాల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. జగన్, కేటీఆర్ కలిస్తే.. పొత్తు పొడిచిందని ప్రచారం చేయడం ఏమిటన్నారు.
పాత కక్ష-కొత్త ట్విస్ట్: 'సెల్ఫ్గోల్, ఏపీలో వైసీపీని ఫినిష్ చేసేందుకే జగన్తో కేసీఆర్ చేయి కలిపారా
రాజకీయ లబ్ధి కోసం టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఫ్రంట్ కోసం కేసీఆర్ మా కంటే ముందు చాలామందిని కలిశారని గుర్తు చేశారు. జగన్, కేటీఆర్ భేటీ పైన టీడీపీ వక్రభాష్యాలు చెబుతోందన్నారు. ఈ భేటీలో పొత్తుల ప్రస్తావన రాలేదన్నారు. ఏపీ హక్కుల కోసం పోరాడేందుకు వైసీపీ కట్టుబడి ఉందని చెప్పారు.
కేసీఆర్తో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడలేదా?
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే కేటీఆర్ తమ అధినేతను కలిశారని బొత్స చెప్పారు. ఇతర రాష్ట్ర నేతలను కలిసికట్టుగానే జగన్ను కలిశారన్నారు. కేసీఆర్తో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడలేదా? నందమూరి హరికృష్ణ భౌతికకాయం దగ్గర పొత్తు కోసం చంద్రబాబు చర్చించలేదా? అని నిలదీశారు. టీడీపీ నేతల అబద్ధాల ప్రచారాన్ని ఏపీ ప్రజలు నమ్మొద్దన్నారు.
ఏపీకి కేసీఆర్ అన్యాయం చేస్తుంటే పొత్తు కోసం బాబు ప్రయత్నమెందుకు?
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తామని, ఎంత దూరం అయినా వెళ్తామని జగన్ ప్రకటించారని బొత్స గుర్తు చేశారు. నిన్నటి భేటీలో ఫెడరల్ ఫ్రంట్ గురించి మాత్రమే చర్చించారని, పొత్తుల గురించి కాదన్నారు. ఏపీకి తెలంగాణ సీఎం కేసీఆర్ అన్యాయం చేసుంటే తెలంగాణ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్తో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ ఎందుకు ప్రయత్నించిందని నిలదీశారు.
ప్రజల్లో అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి
ఒడిశా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులను ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ కలిశారని బొత్స గుర్తు చేశారు. అందులో భాగంగానే జగన్ను టీఆర్ఎస్ నేతలు కలిశారన్నారు. దీనిపై టీడీపీ నేతలు ప్రజల్లో అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారని చెప్పారు. పదేళ్లు హైదరాబాద్లో రాజధాని కొనసాగే అవకాశమున్నా చంద్రబాబు ఎందుకు ముందుగానే వచ్చారన్నారు. టీడీపీ నేతల వక్రబుద్ధిని రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు. ఏపీలో పోలీసు వ్యవస్థను భ్రష్టపట్టిస్తున్నారన్నారు. శాంతి భద్రతలపై నమ్మకం లేకుండా చేశారని టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. టీడీపీ నేతల మాటలకు ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా ఉందన్నారు.
ఇద్దరు యంగ్ డైనమిక్ నాయకులు కలిస్తే వణుకు ఎందుకు?
రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెరాసతో తమ పార్టీ చర్చలు జరిపిందని నగరి ఎమ్మెల్యే రోజా చెప్పారు. జగన్, కేటీఆర్ భేటీ అయితే చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారని ప్రశ్నించారు. ప్రజల్లో అపోహలు సృష్టించి లబ్ధి పొందాలని టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు. జగన్ ఏది చేసినా బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కేటీఆర్తో జగన్ మాట్లాడమే తప్పని టీడీపీ నేతలు అనడం విడ్డూరమన్నారు. ఇద్దరు యంగ్ డైనమిక్ నాయకులు కలిస్తే ఎందుకు వణికిపోతున్నారన్నారు. అమరావతి శంకుస్షాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్ను చంద్రబాబు పిలవడమే కాకుండా రాయిమీద ఆయన పేరు చెక్కించారన్నారు. టీడీపీ నేతలు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదని, గాడిదలు కాస్తున్నారా? అన్నారు.
కేసీఆర్ చుట్టూ మీరు ప్రదక్షిణలు చేసినప్పుడో?
కేసీఆర్ మెప్పు కోసం చంద్రబాబు ముప్పై ఆరు రకాల వంటకాలు చేయించి దగ్గర ఉండి మరీ వడ్డించారని రోజా అన్నారు. అప్పుడు మీ బుద్ది ఏమయిందని ప్రశ్నించారు. కేసీఆర్కు దేవినేని ఉమా విజయవాడలో సన్మానం చేశారని, పరిటాల సునీత కొడుకు పెళ్లిలో కేసీఆర్ మెప్పుకోసం టీడీపీ నేతలు చేసిన ప్రదక్షిణలను అందరూ చూశారన్నారు. మీ రాజకీయ లబ్ధి కోసం ఎన్ని వేషాలైనా వేస్తారా అన్నారు. హైదరాబాద్లో ఉండేందుకు పదేళ్లు గడువున్నా ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని విజయవాడకు చంద్రబాబు పారిపోయి వచ్చారన్నారు. ఈ విషయం అందరికీ తెలుసునని చెప్పారు. ఎప్పుడూ ఎవరితో పొత్తు పెట్టుకుందామా అని చంద్రబాబు ఆలోచిస్తుంటారని, మీరు ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా జగన్ సింగిల్గానే ఎన్నికలకు వస్తారన్నారు. రాష్ట్రానికి మంచి జరిగే విషయమైతే ఎవరితోనైనా జగన్ సంప్రదింపులు జరుపుతారని, జగన్ విశ్వసనీయతపై అందరికీ నమ్మకముందని, ఏపీకి నష్టం కలిగించిన కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నారని, నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఈ విషయం తెలియదా అన్నారు.