పదవులు వదిలేద్దామని అప్పుడే చెప్పా: బొత్స
హైదరాబాద్: గల్లీ నుంచి ఢిల్లీ దాకా పదవులు వదిలేద్దామని తాను రాష్ట్ర విభజనకు అనుకూలంగా యుపిఎ నిర్ణయం వెలువడినప్పుడే చెప్పానని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. తాను అలా చెప్తే తమ వద్ద కార్యాచరణ ఉందని, తమ కార్యక్రమాల ద్వారా విభజనను అడ్డుకుంటామని అన్నారని ఆయన అన్నారు. విజయనగరం జిల్లాలో తన ఆస్తులపై ఆందోళనకారులు దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. సంయమనం పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఝప్తి చేశారు మంత్రివర్గ నిర్ణయం దురదృష్టకరమని ఆయన అన్నారు.
తనకు పదవులు ముఖ్యం కాదని, పదవిలో ఉన్నప్పుడు ఏం సాధించామనేది ముఖ్యమని ఆయన అన్నారు. కుటిల రాజకీయాలతో ప్రజలు కొట్టుకుని పోవద్దని ఆయన కోరారు. ఉద్రేకాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించవద్దని ఆయన మీడియాను కూడా కోరారు. నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని ఆయన మీడియా యజమానులకు విజ్ఞప్తి చేశారు. పదవిని అంటిపెట్టుకుని ఉండాలనే ఉద్దేశం తనకు లేదని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు తప్పు చేసిందని విమర్శిస్తున్నారని, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెసు బాధ్యత వహిస్తుందని తాను ఇదివరకే చెప్పానని ఆయన అన్నారు. గత మూడేళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు సమైక్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తామని కొంత మంది పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కానీ వాస్తవాలను చెప్పాల్సి ఉందని ఆయనఅన్నారు. రాష్ట్ర విభజన ఆగిపోవాంటే రాజకీయ సంక్షోభం రావాలని, అందుకు ఢిల్లీ నుంచి గల్లీ దాకా పదవులను వదిలేద్దామని తాను సూచించానని ఆయన అన్నారు. అయితే తమ వద్ద విభజనను అడ్డుకోవడానికి కార్యాచరణ ఉందని కొంత మంది అన్నారని ఆయన చెప్పారు. వారు ఈ రోజు ఏ కార్యక్రమం చేస్తున్నారో చూడాలని ఆయన అన్నారు.
లేనిపోని మాటలు చెబుతూ అధికార దాహంతో వ్యవహరిస్తున్నారని, అటువంటి స్వార్థపూరిత మాటలను ప్రజలు నమ్మవద్దని ఆయన అన్నారు. రాష్ట్రం ఎటు పోయినా ఫరవాలేదు, తాము ఉండాలనే పద్ధతిలో కొంత మంది వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఆవేశం తగ్గించుకుని, సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని ఆయన ప్రజలను కోరారు. కుతంత్రంలో పడితే ఇబ్బందులు పరిష్కారం కావని, అవి కలకాలం ఉంటాయని, అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
గత ముఖ్యమంత్రి రోశయ్య నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో తాము తెలంగాణకు అనుకూలమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారని, అయితే ఇప్పుడు రాజకీయాలు మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. ఉద్యమంలో హింసకు తావు లేదని అన్నారని, కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు విరుద్ధంగా మారుతోందని ఆయన అన్నారు. ఉద్యమంలో సంఘ వ్యతిరేక శక్తులు రాజకీయ ఆలోచనలతో చొరబడ్డాయని ఆయన అన్నారు. విజయనగరం జిల్లాలో తన ఆస్తులపై దాడులు జరుగుతున్నా సంయమనంతో వ్యవహరించాలని పోలీసులకు సూచించామని ఆయన చెప్పారు.