ఓవర్ టేక్, వేగం: ప్రమాదంపై బొత్స, అఖిల పక్షం పైనా
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతులు, బాధితుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లింపు విషయమై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పిసిసి చీఫ్, రవాణా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం వెల్లడించారు. దుర్ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, దాంతో పాటు మితిమీరిన వేగం కారణంగా బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నామని తెలిపారు. దుర్ఘటన నేపధ్యంలో రవాణా అధికారులతో సమావేశమైన మంత్రి ఆ తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రమాదంలో ఓ చిన్నారి సహా 45 మంది ప్రయాణికులు మతి చెందినట్లు మంత్రి తెలిపారు.
తీవ్రంగా గాయపడ్డ మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. వోల్వో బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా బుధవారం తెల్లవారుఝామున కొత్తకోట సమీపంలో మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో మితిమీరిన వేగం కారణంగా కల్వర్టును ఢీకొనడంతో డీజిల్ ట్యాంకు పేలిపోయి మంటలు చెలరేగాయని చెప్పారు. దీంతో ప్రయాణికులకు తప్పించుకునే అవకాశం ఏమాత్రం లేకుండా పోయిందన్నారు.
ప్రమాదానికి గురైన బస్పు దివాకర్ రోడ్ లైన్స్ సంస్థ పేరుపైనే రిజిస్టరై ఉందని తెలిపారు. జబ్బార్ ట్రావెల్స్ అనే సంస్థకు దివాకర్ రోడ్లైన్స్ సంస్థ ఆ బస్సును లీజుకు ఇచ్చిందని మంత్రి వెల్లడించారు. దివాకర్ రోడ్ లైన్స్కు చెందిన ఈ బస్సు 2011 అక్టోబర్లో బెంగళూరుకు బదిలీ అయ్యిందని, పర్మిట్లు తీసుకోవడం సహా పన్నుల చెల్లింపులు, ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ వంటి ప్రక్రియలన్నీ అక్కడి నుంచే కొనసాగుతున్నాయని చెప్పారు.
విధివిధానాలు పరిశీలించాకే
అఖిలపక్షం తేదీ, విధివిధానాలకు సంబంధించి అధికారిక సమాచారం అందిన తర్వాతే ఎవరు వెళ్లాలి, ఏం మాట్లాడాలి అనే అంశాలపై పార్టీ ముఖ్యనేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బొత్స తెలంగాణపై అఖిల పక్ష భేటీ విషయమై వివరించారు. సిడబ్ల్యుసి నిర్ణయం తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో పెరిగిన ఉద్రిక్తతలు, ఆందోళనల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తాను ప్రధాని మన్మోహన్ సింగ్కు రాసిన లేఖకు స్పందనే ఈ నిర్ణయమని చెప్పారు.