'చంద్రబాబు దుబాయ్ పర్యటన వెనుక రహస్యమేంటి?'
చంద్రబాబు దుబాయ్ పర్యటనల వెనుక రహస్యమేమిటో చెప్పాలని వైసీపీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: రాజకీయ లబ్ది పొందేందుకే టీడీపీ నేతలంతా ఎదుటివారిపై బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని, వాటిని మానుకుంటే మంచిదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ హితవు పలికారు. రోజురోజుకు సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా దిగజారిపోయి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐడీఎస్(స్వచ్చంద ఆదాయ వెల్లడి) పథకం కింద హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి రూ.10వేల కోట్లను ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ కు అప్పగించడంతో.. చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా జగన్ వైపే వేలెత్తి చూపారని, వారంతా ఇప్పుడేం సమాధానం చెబుతారని బొత్స ప్రశ్నించారు. కాగా, ఆ వ్యక్తి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కు చెందిన లక్ష్మణరావు అని తేలడంతో బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్రం ప్రకటించిన ఐడీఎస్ పథకం అపహాస్యం అయిపోయిందని బొత్స కామెంట్ చేశారు. మోసం, దగా, అబద్దాలు చంద్రబాబు నిత్యం చేసే పనులేనని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దుకు ముందే ఫ్యూచర్ గ్రూప్ తో ఆయన కుదుర్చుకున్న ఒప్పందాలు త్వరలోనే బయటకొస్తాయని చెప్పారు.
ఈ సందర్బంగా చంద్రబాబు దుబాయ్ పర్యటనల వెనుక రహస్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. దుబాయ్ కు చెందిన బీఆర్ షెట్టి గ్రూపుకు అమరావతిలో భూకేటయింపులు చేశారని, వాటిని చక్కదిద్దుకునేందుకే చంద్రబాబు దుబాయ్ వెళ్లాడని బొత్స ఆరోపించారు. ఆ రహస్యాలు త్వరలోనే బయటపెడుతామని, ఇకనైనా టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలను మానుకోవాలని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications