పనికిమాలిన వాళ్లవి పట్టించుకోం: జగన్, బాబుపై బొత్స
హైదరాబాద్: పనికిమాలిన వాళ్ల దీక్షలను తాము పట్టించుకోమని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదివారం విజయనగరం జిల్లాలో అన్నారు. ఆయనను పలువురు ఐకాస నాయకులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్రని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు నిరాహార దీక్షలు చేశారని, ఆ తరహా దీక్షలను కాంగ్రెస్ నేతలు కూడా చేస్తే బాగుంటుందని ఐకాస నేతలు అన్నారు.
దానిపై బొత్స అసహనం వ్యక్తం చేశారు. పనికిమాలిన వాళ్ల దీక్షలను తాము పట్టించుకోబోమన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని బొత్సను ఐకాస నాయకులు కోరారు. దీనిపై ఆయన స్పందిస్తూ తాను కూడా సమైక్యవాదినేనని, అసెంబ్లీలో తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని చెప్పారు. ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి పదవికి రాజీనామా చేయకపోవడంపై ప్రశ్నించగా... పార్లమెంటులో మన వాణి విన్పించడానికే ఆమె పదవిలో కొనసాగుతున్నారని బొత్స తెలిపారు.
రాష్ట్ర విభజనపై తనకు తానుగా ప్రకటించిన షెడ్యూల్ను పక్కనపెట్టి హడావుడిగా తెలంగాణ అంశంపై నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని మంత్రి శైలజానాథ్ వేరుగా కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరో తరుముకొస్తున్నట్లుగా ఈవిధంగా వ్యవహరించడం బా గోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నా ఇలా చేయడం సరికాదన్నారు.
ఐదున్నర కోట్ల మంది ప్రజలు ఉద్యమిస్తున్నా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఆయా ప్రాంతాల ప్రజలతో చర్చించకుం డా, వారి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర విభజనపై ముందుకువెళ్లడం అప్రజాస్వామికమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం, పార్టీ పెద్దలు ఆలోచించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంపై బిల్లు, ముసాయిదా ఏ రూపంలో అసెంబ్లీకి వచ్చినా విభజన నిర్ణయాన్ని అడ్డుకుని తీరుతామన్నారు.
విభజన విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. కనీసం ముఖ్యమంత్రి, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ముఖ్యనేతల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన విషయంలో అధిష్ఠానం తీరు సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ శ్రేణుల్ని బాధిస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్నారంటూ కొందరు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ముఖ్యమంత్రి సమైక్యవాదే అన్నారు.