కెసిఆర్తో చంద్రబాబు ఏం మాట్లాడారో చెప్పండి: బొత్స
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను తనకు పంపించవద్దంటూ తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాసిన బహిరంగ లేఖకు ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ తప్పు పట్టారు. లేఖలోని ఏ ఒక్క అంశానికి కూడా ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని ఆయన అన్నారు.
పార్టీ నేతలు పార్థసారథి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపన పేరుతో ప్రభుత్వం చేస్తున్న దోపిడీని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అనవసరమైన ఆడంబరాలకు పోతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్తో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం మాట్లాడారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తాము ప్రశ్నించినందుకు మంత్రులు తమను నోటికి వచ్చినట్లు తిట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని అవసరమని, దానికి తాము వ్యతిరేకం కాదని, అయితే శంకుస్థాపన పేరుతో చేస్తున్న దోపిడీని తాము వ్యతిరేకిస్తున్నామని బొత్స చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న భూదందాకు, హంగామాకు తాము వ్యతిరేకమని అన్నారు.
రాష్ట్రాన్ని సింగపూర్కు తాకట్టు పెడుతున్న కార్యక్రమానికి వచ్చి సాక్షి సంతకాలు పెట్టాలా అని ఆయన అడిగారు. తమతో పాటు సిపిఎం, లోకసత్తా పార్టీలు కూడా అదే మాట చెబుతున్నాయని ఆయన అన్నారు. భూమి పూజ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పిలువలేదని ఆయన ప్రశ్నించారు. బలవంతపు భూసేకరణ వద్దని చెప్పినా పట్టించుకోలేదని అన్నారు.