టవల్ కట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బుడతడు; ఫిర్యాదు విన్న పోలీసులు షాక్!!
ప్రస్తుతం పిల్లలకు పోలీసులు అన్నా, పోలీస్ స్టేషన్లు అన్నా భయం లేకుండా పోయింది. ఇంట్లో ఏ చిన్న సంఘటన జరిగినా సరే నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తల్లిదండ్రులపైన ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా అటువంటి ఆసక్తికర ఘటనఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరులో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే..
ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు అందరూ విధులు నిర్వహిస్తున్న వేళ ఒంటిపై కనీసం చొక్కా లేకుండా, టవల్ కట్టుకొని ఓ బుడతడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. నేరుగా పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళిన బుడతడు, తన ఫ్రెండ్ పుట్టినరోజు కి వెళ్లడానికి వాళ్ళ అమ్మ తనకు షర్ట్ ఇవ్వటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఏలూరులోని కొత్తపేటకు చెందిన సాయి దినేష్ నాలుగో తరగతి చదువుతున్నాడు. అనారోగ్యంతో అతని తల్లి మరణించడంతో తండ్రి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే తన సవతి తల్లి తన ఫ్రెండ్ పుట్టినరోజుకి వెళ్లడానికి తనను అంగీకరించటం లేదని, తనకు చొక్కా ఇవ్వకుండా తనను కొట్టిందని బుడతడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
దీంతో పదేళ్ల బాలుడి ఫిర్యాదు విని షాకైన పోలీసులు బాలుడి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. పిల్లల పట్ల ప్రేమతో వ్యవహరించాలని వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే తల్లిదండ్రుల పట్ల గౌరవంతో ప్రవర్తించాలని బాలుడికి కూడా బుద్ధి చెప్పారు. ఆపై బాలుడిని, తల్లిదండ్రులను ఇంటికి పంపించారు.
గతంలో కూడా బాలుడు అల్లరి చేస్తున్నాడని సవతి తల్లి అతనికి వాతలు పెట్టింది. అయితే స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకు వెళ్ళడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తాజాగా మరోమారు బాలుడు సవతి తల్లి పై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో ఏలూరు టూ టౌన్ పోలీసులు ఈ సారి ఆమెను గట్టిగానే హెచ్చరించి పంపించారు. ఇదే సమయంలో తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలని బాలుడికి చెప్పారు.












Click it and Unblock the Notifications