చంపేస్తామన్నారు, పరిటాల సునీత నుంచి ప్రాణహానీ: బోయ సూర్యం
అనంతపురం: తెలుగుదేశం పార్టీలో చేరకపోతే చంపుతామని తనను ఆ పార్టీ కార్యకర్తలు బెదిరించినట్లు దాడికి గురైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్త బోయ సూర్యం తెలిపారు. మంత్రి పరిటాల సునీత ఆదేశాలతోనే తమ పార్టీ నేతలపై, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
మంత్రి సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్ సమక్షంలోనే తనపై దాడి జరిగిందని ఆయన మీడియా సమావేశంలో ఆరోపించారు. తనతో బలవంతంగా టిడిపి నేతలు సంతకాలు సేకరించారని చెప్పారు.
తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు..
టడిపిలో చేరకపోతే చంపుతామని బెదిరించి తెల్ల కాగితాలపై సంతకాలు చేయిస్తుంటే పోలీసులు ప్రేక్షకుల్లా మిగిలిపోయారని బోయ సూర్యం ఆరోపించారు. అదే సంతకంతో వైసిపి నేతలు తోపుదుర్తి చందు, నాగరాజులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇదంతా పరిటాల కనుసన్నల్లోనే జరుగుతోందని అన్నారు.
పరిటాల సునీత నుంచి ప్రాణ హాని
పరిటాల వర్గీయులు అరాచాకాలు చేస్తుంటే రామగిరి సిఐ, ఎస్ఐ, ఇతర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని బోయ సూర్యం అన్నారు మంత్రి సునీత నుంచి తన ప్రాణహాని ఉందని ఆయన అన్నారు. తనక రక్షణ కల్పించాలని ఆయన కోరారు.
మండలంలో పోలీసు వ్యవస్థ లేదు
రామగిరి మండలంలో పోలీసు వ్యవస్థ లేదని, మంత్రి పరిటాల సునీత అరాచకాలపై ఎస్పీ మౌనంగా ఉన్నారని వైసిపి రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. రామగిరిలో సమావేశాలను నిర్వహించుకోవడానికి మూడేళ్లుగా అనుమతి అడుగుతున్నా ఇవ్వడం లేదని ఆయన చెప్పారు.
సునీతను బర్తరఫ్ చేయాలి
రామగిరి వైసిపి కార్యకర్త సూర్యంపై దాడి చేసి తమపైనే అక్రమ కేసులు బనాయించడం ఏం న్యాయమని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అడిగారు. పరిటాల సునీతను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరిటాల వర్గీయుల అరాచకాలపై హైకోర్టుకు వెళ్లి న్యాయాన్ని కాపాడుకుంటామని ఆయన చెప్పారు.