స్ధానిక ఎన్నికల వాయిదాతో వైసీపీలో చేరికలకూ బ్రేక్.. మళ్లీ ఎప్పుడంటే...
ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు వాయిదాతో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు కూడా బ్రేక్ పడినట్లయింది. నిన్న మొన్నటి వరకూ వైసీపీలో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన నేతలంతా ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. మళ్లీ ఎన్నికలు జరినప్పుడు చూద్దాంలే అనే సమాధానం ఇస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు కూడా కొంతకాలం పాటు ఆపరేషన్ ఆకర్ష్ ను వాయిదా వేసుకున్నట్లే కనిపిస్తోంది.
స్ధానిక ఎన్నికలకు ముందు, తర్వాత...
ఏపీ స్ధానిక ఎన్నికల పోరుకు ముందు వైసీపీలో చేరేందుకు విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ నేతలెవరూ అంతగా ఇష్టపడలేదు. అప్పటి వరకూ ప్రభుత్వ విధానాల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తూ వచ్చిన విపక్షాలకు ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత పరిస్దితి తెలిసివచ్చింది. స్ధానిక పోరులో సహజంగానే అధికార పార్టీకి ఉండే ఎడ్జ్ తో పాటు ఇతర సానుకూలతలను గ్రహించిన విపక్ష నేతలు వైసీపీలోకి క్యూ కట్టారు. ఓ దశలో దాదాపు పది మందికి పైగా మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకరివెంట ఒకరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి కండువాలు కప్పేసుకున్నారు. దీంతో ఓ దశలో స్ధానిక పోరులో టీడీపీ, జనసేన వంటి పార్టీలు పూర్తిగా చేతులెత్తేసినట్లే కనిపించింది.
ఎన్నికల పోరు వాయిదా పడ్డాక...
స్ధానిక ఎన్నికల పోరు జరుగుతున్నంత సేపు ప్రతిరోజూ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వలస నేతల హవా కొనసాగింది. ఎప్పుడైతే స్ధానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా పడిందని తెలిసిందో విపక్ష నేతలు కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అప్పటివరకూ అధికార వైసీపీ నేతల నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందో అని ఎదురుచూసిన నేతలంతా ఇప్పుడు వారు ఫోన్ చేసినా తీయడం లేదట. దీంతో చేసేది లేక వైసీపీ కూడా తమ ఆపరేషన్ ఆకర్ష్ కు తాత్కాలికంగా బ్రేక్ వేసేసింది. ఎన్నికల వాయిదా ప్రకటన రావడానికి కొద్ది గంటల ముందే టీడీపీకి చెందిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వైసీపీలోకి వస్తారని తీవ్రంగా ప్రచారం జరిగినా ఆయన మాత్రం చివరి నిమిషంలో వచ్చిన సమాచారంతోనే ఆయన చేరకుండా సోదరులను మాత్రమే వైసీపీలోకి పంపినట్లు తెలుస్తోంది.
వలస నేతల అప్రమత్తత...
వైసీపీలోకి ఫిరాయించేందుకు అప్పటివరకూ తీవ్ర ప్రయత్నాలు చేసిన పలువురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ వ్యూహం మార్చుకోవడం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత వైసీపీ దాడుల భయంతోనో, స్ధానికంగా అధికారుల దాడులతోనో వైసీపీలోకి ఫిరాయిస్తే చాలని వారంతా భావించారు. కానీ స్ధానిక ఎన్నికల పోరు వాయిదా పడిన నేపథ్యంలో తమ వ్యాపారాలపై అధికారుల ఒత్తిళ్లతో పాటు వైసీపీ నేతల దాడులు కూడా నిలిచిపోయాయి. దీంతో వారికి ఒక్కసారిగా ఊరట దక్కినట్లయింది. కాబట్టి వెంటనే తమ వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది.
Recommended Video
వైసీపీ ఆపరేషన్ బ్రేక్ వెనుక..
స్ధానిక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిన తరుణంలో జిల్లాల్లోని టీడీపీ నేతల నుంచి స్పందన తగ్గింది. అదే సమయంలో ఎన్నికల వాయిదా వ్యవహారాన్ని ఏదో ఒకటి తేల్చకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. వీటితో పాటు మరికొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా తమ ఆపరేషన్ ఆకర్ష్ కు బ్రేక్ వేయాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పార్టీ నేతలకూ ఈ మేరకు సందేశాలు వెళ్లాయి. ఓసారి ఎన్నికల ప్రక్రియ మొదలైతే విపక్షాల నుంచి మళ్లీ వలసల తాకిడి పెరుగుతుందని భావిస్తున్న వైసీపీ పెద్దలు.. అప్పటి వరకూ మౌనంగా ఉంటేనే మేలనే అంచనాకు వచ్చేశారు.