సీఎం జగన్ సంచలనం - ఆ నలుగురిపై వేటు..!!
ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఓటమికి కారణమైన నలుగురు ఎమ్మెల్యేల పైన వేటు వేసారు. ఇప్పటికే పార్టీకి దూరమైన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటుగా తాజాగా క్రాస్ ఓటింగ్ చేసిన ఉండవల్లి శ్రీదేవి.. మేకపాటి చంద్రశేఖర రెడ్డి పైన వేటు వేస్తూ సీఎం జగన్ నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పార్టీ అభ్యర్ది ఓటమి పాలవటం సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారు.
ఇప్పటి వరకు క్రాస్ ఓటింగ్ చేసినట్లుగా శ్రీదేవి.. మేకపాటి చంద్రశేఖర రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నా, ఆ ఇద్దరూ ఖండించారు. కానీ, ఎన్నికల సమయంలో జరిగిన ఓటింగ్ ఆధారంగా ముందుగా వైసీపీ ఇచ్చిన కోడింగ్ ద్వారా ఈ ఇద్దరే టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేసినట్లుగా నిర్దారణకు వచ్చారు. ఫలితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని డిసైడ్ అయ్యారు.
సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి అనూహ్య విజయం సాధించారు. వైసీపీ నుంచి ఏడుగురు అభ్యర్దులు బరిలో నిలిచారు. ఏడుగురు విజయం కోసం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటుగా టీడీపీ నుంచి నలుగురు, జనసేన నుంచి ఒక అభ్యర్ది మద్దతు ఉంది. దీంతో మొత్తంగా 156 సభ్యుల సంఖ్యా బలం ఉంది.
ఇందులో ఆనం - కోటంరెడ్డి ఇప్పటికే టీడీపీతో టచ్ లోకి వెళ్లటంతో ఆ ఇద్దరి ఓట్లను వైసీపీ సీరియస్ గా తీసుకోలేదు. దీంతో 154 మంది సభ్యులను ఏడుగురు అభ్యర్దులను గెలవటం కోసం 22 మంది చొప్పున కేటాయించారు. టీడీపీకి వైసీపీ నుంచి ఇద్దరు సభ్యుల మద్దతు ఉన్నా..కావాల్సిన 22 ఓట్లకు ఇంకా ఒక ఓటు తగ్గాలి. కానీ, 23 ఓట్లు టీడీపీ అభ్యర్దికి పోలయ్యాయి.
నలుగురి పైన ఒకేసారి వేటు
తమ పార్టీ కోలా గురువులు ఓడి.. టీడీపీ అభ్యర్ధికి క్రాస్ అయిన రెండు ఓట్ల పైన వైసీపీ లోతుగా అధ్యయనం చేసింది. అందులో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి..నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లుగా నిర్దారణకు వచ్చారు. చంద్రబాబు ఒక్కొక్కరికి రూ 10 నుంచి 15 కోట్ల వరకు ఇచ్చి ప్రలోభాలకు గురి చేసారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ఆరోపించారు. పూర్తి ఆధారాలతో నిరూపణ అయిన తరువాతనే క్రమశిక్షణా సంఘం సూచనల మేరకు ఈ నలుగురు శాసన సభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.
వీరికి పార్టీ పైన అసంతృప్తి ఉంటే పార్టీలో ఉండి చర్చించాలని చెప్పుకొచ్చారు. ఇప్పుడు టీడీపీలో వాళ్లకు ఏం హామీ ఇచ్చినా అది అమలు కాదన్నారు. సీటు దక్కదు..ఇవ్వలేని పరిస్థితి ఉంటే పార్టీ వారి సేవలను మరో విధంగా ఉపయోగించుకుంటుందని చెప్పుకొచ్చారు. మరి కొందరికి పార్టీలో పదవులు రాక అసంతృప్తితో ఉన్నారని..కానీ, వారంతా పార్టీలోనే విధేయులుగా ఉన్నారని సజ్జల వివరించారు.
కఠినంగా మరిన్ని నిర్ణయాల దిశగా
ఇప్పటి వరకు ఆనం - కోటంరెడ్డి వ్యవహార శైలి పైన ఇప్పటి వరకు పార్టీ వేచి చూసే ధోరణితో వ్యవహరించింది. కానీ, ఇప్పుడు ఈ నలుగురు టీడీపీ అభ్యర్దికి అనుకూలంగా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి క్రాస్ ఓటింగ్ చేయటంతో సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే చర్యలు తీసుకోకుంటే పార్టీలో ప్రతికూల సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని భావించినట్లుగా తెలుస్తోంది.
ఫలితంగా వెంటనే నలుగురి ఎమ్మెల్యేల పైన వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే పార్టీ ఈ నిర్ణయం ప్రకటించింది. పూర్తి దర్యాప్తు తరువాతనే చర్యలు తీసుకున్నట్లు సజ్జల స్పష్టం చేసారు. ఇక, మరి కొన్ని సంచలన నిర్ణయాల దిశగా ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.