ఏపీలో గూండా సర్కారు: చంద్రబాబుపై బృందా కారత్ ఫైర్
పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లాఠీలు, తుపాకులు ప్రయోగించే గూండా సర్కారు రాజ్యమేలుతోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందా కారత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భీమవరం మండలం తుందుర్రులో మెగా ఆక్వా ఫుడ్ పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తూ అఖిలపక్షం గురువారం భీమవరంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా బృందాకారట్ హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా బృందా కారత్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజల బాబు కాదు.. పరిశ్రమల బాబు అని విమర్శించారు. ఏపీలో ప్రస్తుతం ప్రజాభీష్టానికి అనుగుణంగా పనిచేసే ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.
తుందుర్రులో ఫుడ్పార్క్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం దారుణమన్నారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఫుడ్ కోర్టు నిర్మాణానికి అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అందరూ కలిసికట్టుగా పోరాడి చంద్రబాబుతో కన్నీళ్లు తెప్పించాలని పిలుపునిచ్చారు.
తుందుర్రులో వర్గాలకు అతీతంగా అందరూ కలిసి పోరాటం చేయడం అభినందనీయమని, ఇక్కడ స్త్రీలు ఎవరూ కన్నీళ్లు పెట్టవద్దని, నేతల కంట కన్నీరు పెట్టించాలని సూచించారు. పరిశ్రమపై చంద్రబాబు, వెంకయ్యనాయుడుతో ఢిల్లీలోనే సమాధానం చెప్పేలా చేస్తామని అన్నారు.
దేశవ్యాప్తంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో పేదలు, రైతులపై దాడులు చేస్తున్నారని, ఇక వారి ఆటలు సాగనివ్వమని స్పష్టం చేశారు.
సభకు అధ్యక్షతన వహించిన సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ..
ఆక్వా ఫుడ్పార్క్ను తక్షణం జనావాసాలు లేని చోటికి తరలించాలని డిమాండ్ చేశారు. ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ అభివృద్ధి అంటే ఉన్న హక్కులు కాలరాయడం కాదన్నారు. డీసీసీ అధ్యక్షుడు రఫీవుల్లాబేగ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దోపిడీలు చేయడం తప్ప అభివృద్ధి పట్టదని విమర్శించారు.
ఆక్వా పార్కుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి పూర్తిగా అండగా నిలుస్తామని ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ.. 144 సెక్షన్ విధించి పార్క్ నిర్మించాలనుకోవడం దారుణమని పేర్కొన్నారు. ఇటువంటి పరిశ్రమలు పచ్చటి పల్లెల్లో కాకుండా తీర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని అన్నారు.












Click it and Unblock the Notifications