జగన్ కు కేసీఆర్ షాక్.. APలో BRS కార్యాలయం అక్కడే?
తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత పార్టీ విస్తరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిసారించారు. జాతీయ పార్టీ హోదా సాధించడానికి అనుగుణంగా ఆయన అడుగులు వేస్తున్నారు. కర్ణాటకలో జేడీఎస్ తో కలిసి పోటీచేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఏపీలో ఒంటరిగా పోటీచేసే అవకాశం కనపడుతోంది. పార్టీ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించింది. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మారుస్తున్నట్లు వెల్లడించింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం విజయవాడలోనే కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. దీన్నిబట్టి ఆయన అమరావతి రాజధానివైపు మొగ్గుచూపినట్లు కనపడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విజయవాడ జక్కంపూడిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు జాతీయ రహదారి సమీపంలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు కేసీఆర్ దాదాపుగా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 800 గజాల్లో కార్యాలయం నిర్మించాలని నిర్ణయించారు. వాటి బాధ్యతను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అప్పగించారు. ఈనెల 18, 19 తేదీల్లో తలసాని విజయవాడలో పర్యటించనున్నారు. జక్కంపూడి వెళ్లి పార్టీ నిర్మాణానికి అవసరమైన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. ఈనెల 14వ తేదీన కేసీఆర్ ఢిల్లీలో కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లోను పార్టీ విస్తరణపై దృష్టిసారిస్తారు. మరోవైపు ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కనపడుతున్నాయి. కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి... ఏపీ అభ్యుదయానికి బీఆర్ఎస్ భరోసా అంటూ ఫ్లెక్సీల్లో నాయకులు పేర్కొంటున్నారు.