ఏపీలో బీఆర్ఎస్ మైండ్ గేమ్ స్టార్ట్ ! 175 సీట్ల పోటీ ప్రకటన అందుకే ? వైసీపీ కంటే విపక్షాలకే దెబ్బ !
ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లలోనూ పోటీ చేస్తామని బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ చేసిన ప్రకటన విపక్ష శిబిరంలో కలవరం పుట్టిస్తోంది.
ఏపీలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ మొదలైంది. ఇన్నాళ్లూ తెలంగాణలో ఏ మైండ్ గేమ్ తో అయితే విపక్షాలను కకావికలం చేస్తున్నారో అదే తరహా మైండ్ గేమ్ ను ఇప్పుడు ఏపీలోనూ ప్రయోగించేందుకు కేసీఆర్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. రాష్టంలో కనీసం కార్యకర్తలు కూడా నిండుగా లేని పరిస్దితుల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. వచ్చే ఏడాది 175 సీట్లలో పోటీకి సిద్దమవుతుండటం వ్యూహాత్మకమేనని తెలుస్తోంది.

బీఆర్ఎస్ 175 సీట్ల పోటీ ప్రకటన
ఏపీలో బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లలోనూ, 25 పార్లమెంట్ స్ధానాల్లోనూ పోటీచేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ నిన్న ఆర్భాటంగా ప్రకటించేశారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కనీసం పార్టీ ఆఫీసు కూడా ప్రారంభించకపోయినా, కార్యకర్తలు లేకపోయినా, పేరుకు చెప్పుకునేందుకు కనీసం ఒకరిద్దరు నాయకులు కూడా లేని పార్టీ 175 సీట్లలో పోటీ చేయబోతోందంటూ తోట చంద్రశేఖర్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. ఓవైపు వైసీపీ 175 సీట్లు గెలవబోతోందంటూ జగన్, టీడీపీ 160 సీట్లు గెలవబోతోందంటూ చంద్రబాబు ప్రకటనలు చేస్తున్న తరుణంలో బీఆర్ఎస్ 175 సీట్ల పోటీ ప్రకటనపై చర్చ జరుగుతోంది.

బీజేపీ ఉనికే లేని చోట పోరు ఎవరిపై ?
బీజేపీతో పోరు కోసమే పెట్టిన బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు ఏపీలో ఆ పార్టీకి డిపాజిట్లే రాని స్ధితిలో ఉన్న నేపథ్యంలో ఇక ఎవరిపై పోరాడబోతోందన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే బీజేపీతో నేరుగా తలపడే పరిస్ధితి ఎలాగో లేదు. ఆ మాట కొస్తే బీజేపీకే 175 సీట్లలో అభ్యర్ధులు లేరు. అప్పుడు బీజేపీ మిత్రులపై పోరాడటం మినహా బీఆర్ఎస్ చేయడానికి కూడా ఏమీ కనిపించడం లేదు. ముఖ్యంగా ఇక్కడ అన్ని పార్టీలు కూడా బీజేపీ జపం చేస్తున్న తరుణంలో అన్ని పార్టీలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వైసీపీకి ప్లస్, విపక్షాలకు మైనస్ ఇలా..
బీఆర్ఎస్ 175 సీట్లలో నిజంగానే అనుకున్నట్లుగానే పోటీ చేస్తే అది ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే బీజేపీతో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు అంటకాగుతున్నా.. అధికార పార్టీ మాత్రం అది కేవలం కేంద్ర, రాష్ట్ర సంబంధాలుగానే చెప్పుకుంటోంది. కానీ జనసేన మాత్రం నేరుగా మిత్రపక్షంగా ఉంది. టీడీపీ బీజేపీతో పొత్తు కోసం ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో వైసీపీపై నేరుగా పోరాడాలంటే కేసీఆర్ కు జగన్ తో స్నేహం గుర్తుకొస్తుంది. అప్పుడు విపక్ష పార్టీలైన జనసేన, టీడీపీలకు వ్యతిరేకంగానే బీఆర్ఎస్ పోరాడాల్సి ఉంటుంది. ఇప్పటికే జనసేన ఓటు బ్యాంకుగా భావిస్తున్న కాపులకు పెద్దపీట వేసేందుకు తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడిగా నియమించిన కేసీఆర్.. ఆ పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక మిగిలింది టీడీపీ. అంటే వీరిద్దరికీ తీవ్ర నష్టం కలిగించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications