నా జీన్స్లోనే పేకాట, వార్త రాయిస్తారా: జగన్కు బిటెక్ రవి సవాల్
వచ్చే ఎన్నికల్లో జగన్ను పులివెందులలో ఓడిస్తామని బిటెక్ రవి సవాల్ చేశారు. పత్రికలో తప్పుడు వార్త రాయిస్తారా, పేకాట తన జీన్స్లోని ఉందని ఆయన అన్నారు.
కడప: కడపలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించిన ఊపులో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు బిటెక్ రవి సవాళ్ల మీద సవాళ్లు విసిరారు. వైఎస్ కంచుకోట బద్దలు కొట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన విజయం తన చిన్నాన్న దివంగత మారెడ్డి రామచంద్రారెడ్డికి అంకితం చేస్తున్నానని విజయోత్సవ ర్యాలీ అనంతరం మంగళవారం జరిగిన సమావేశంలో బీటెక్ రవి అన్నారు.
తనపై మండల ప్రజల ఆదరాభిమానాలు ఉండడంతో తాను ఈరోజు ఈ స్థితికి వచ్చానని అన్నారు. ఈ పోటీలో నిలబడటం, చాలా ఖర్చుతో కూడిన పని అని, అందులోనూ వైఎస్ కుటుంబ సభ్యులపై పోటీ ఆషామాషీ కాదని తెలిసినా ఎదురొడ్డి అందరి సహకారంతో విజయం సాధించానని ఆయన అన్నారు.
వైఎస్ కటుంబ సభ్యులను ఓడించడం సాధ్యం కాని పని అని తెలిసినా పదవి లేనిదే కార్యకర్తలకు న్యాయం జరగదని అందరికీ తెలుసునని, అందులో తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్సీ సీటు కేటాయించడంతో అద్భుతం జరిగిందని చెప్పారు.
వారిద్దరు కలిసి చెప్పడం వల్లే..
శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఇద్దరూ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఎమ్మెల్సీ సీటుకు తనపేరు ప్రతిపాదించారని, దాంతో వారిద్దరికీ సమ్మతమైతే తనకు పార్టీలో శత్రువులు ఉండకపోవచ్చని గ్రహించి సీటు ఇచ్చారని బిటెక్ రవి చెప్పారు.
పేకాట నా జీన్స్లో ఉంది...
ఒక పేపర్లో తనపై వార్తలు రాయించారని బిటెక్ రవి సాక్షి దినపత్రికను ఉద్దేశించి అన్నారు. ధర్మరాజు కూడా జూదమాడాడని చరిత్ర చెబుతోందని, తన జీన్స్లోనే పేకాట ఆడటం ఉందని ఆయన అన్నారు. ఈరోజు ఎమ్మెల్సీగా 38ఓట్ల మెజార్టీతో గెలుపొందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులు, నారా లోకేష్ డైరెక్షనతో జిల్లాలోని ప్రజా ప్రతినిధులంతా సమష్టిగా ముందుకెళ్లడంతో సాధ్యమైందని చెప్పారు.
నారా లోకేష్ మాటలే...
మొత్తం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు తన ఎన్నికపై ఆధారపడి ఉందని చంద్రబాబు, నారా లోకేష్ అన్నమాటలు మనస్సులో పెట్టుకుని కష్టపడ్డానని చెప్పారు. మన మండలంలో రెండు దఫాలు ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయానని, ఆ తర్వాత తన చిన్నాన్న రామచంద్రారెడ్డి హత్యకు గురయ్యారని ఆయన చెప్పారు. తన చిన్నాన్న మరణం తర్వాత పూర్తిస్థాయి రాజకీయ బాధ్యతలు చేపట్టానని చెప్పారు. చిన్నాన్న మరణానంతరం సర్పంచుగా పోటీచేసే పరిస్థితుల్లో కసనూరు గ్రామస్థులు, స్నేహితులు అభిమానుల సహకారంతో సర్పంచుగా గెలిచానని చెప్పారు.
ఆయనను దించి జగన్ను ఓడిస్తాం...
రాజకీయంగా పూర్తిస్థాయిలో ప్రజలముందే ఉంటానని బిటెక్ రవి చెప్పారు. సింహాద్రిపురం సహా అన్ని గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తానని బీటెక్ రవి హామీ ఇచ్చారు. వైఎస్ కుటుంబ సభ్యులపై గెలవడంతో బీటెక్ రవి గుర్తింపు మరింత పెరిగిందన్నారు. ప్రస్తుతం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిపై గెలిచానని చెప్పారు. 2019 ఎన్నికల్లో జగనపై సతీష్రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిపి జగన్ను ఓడిస్తామన్నారు.