చెన్నైకి బుల్లెట్ ట్రైన్, బెజవాడకు రోడ్ల కలయిక: శిద్దా
ఒంగోలు: జపాన్ ఆర్థిక సహాయంతో విశాఖపట్నం - చెన్నై మధ్య త్వరలో బుల్లెట్ రైలు ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణ శాఖ మంత్రి శిద్దా రాఘవ రావు ఆదివారం తెలిపారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
విశాఖపట్నం - చెన్నై మధ్య 840 కిలోమీటర్ల దూరం ఉందని, ప్రస్తుతం విశాఖపట్నం నుండి చెన్నై వెళ్లాలంటే 12 గంటల సమయం పడుతుందని, ఇక బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం నాలుగు గంటల్లో చేరుకునే అవకాశం ఉందన్నారు. చెన్నై - విశాఖ మధ్య బుల్లెట్ రైలును ఏర్పాటు చేసేందకు జపాన్ ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో బుల్లెట్ రైళ్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయిందన్నారు. ఆర్టీసీలోని కార్మిక సంఘాల నేతలు, అధికారులతో చర్చించిన తరువాత ముఖ్యమంత్రి ఆర్టిసి సంస్థను తాత్కాలికంగా నష్టాల నుండి కాపాడేందుకు 250 కోట్ల రూపాయలు తక్షణ సహాయం కింద విడుదల చేశారన్నారు.
ఆర్టీసీని నష్టాల బాట నుండి గట్టెక్కించేందుకు అన్ని మార్గాలను వెదుకుతున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని రహదారులు రాజధాని విజయవాడకు అనుసంధానం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని రహదారులకు మరమ్మతులు చేస్తున్నట్లు మంత్రి శిద్దా తెలిపారు. 13 జిల్లాల నుంచి ప్రజల రాకపోకలకు అనుగుంగా రహదారులను అనుసంధానం చేస్తామన్నారు. విజయవాడకు ఏ జిల్లా నుంచైనా 6 గంటల్లోగా చేరేలా రోడ్లు అనుసంధానం చేస్తామన్నారు.