విషాద ‘జర్నీ’: పెళ్లి చూపులకు వెళ్తూ సోదరులు, కూతుర్ని కొత్త కాపురానికి తీసుకెళ్తూ..
కృష్ణా జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది.ఈ ప్రమాదంలో 11మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20మందికి పైగా గాయాలపాలయ్యారు.
విజయవాడ: కృష్ణా జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది.ఈ ప్రమాదంలో 11మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20మందికి పైగా గాయాలపాలయ్యారు. తమ వారిని కలిసేందుకు, ఉద్యోగం కోసం, శుభ కార్యాల కోసం వెళ్తున్నవారు ప్రాణాలు కోల్పోవడం వారి వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.
కొత్త కాపురానికి తీసుకెళ్తూ..
ఈ బస్సు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి మండలం చెత్తకండ్రికుంట గ్రామానికి చెందిన పంగా తులసమ్మ మృతి చెందింది. కూతురు, అల్లుడితో హైదరాబాద్లో కొత్తకాపురం పెట్టించడానికి వెళ్తూ ఆమె మృత్యువాతపడింది.
కల్వర్టులో పడిపోయిన దివాకర్ ట్రావెల్స్ బస్సు: 11మంది మృతి, 20మందికి గాయాలు
గత జనవరి 15న తులసమ్మ కుమార్తె రేవతికి వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో కుమార్తె, అల్లుడితో హైదరాబాద్లో కొత్త కాపురం పెట్టించేందుకు వారితో కలిసి సోమవారం రాత్రి బయలుదేరింది. దివాకర్ ట్రావెల్స్ బస్సులో వస్తుండగా ముళ్లపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో తులసమ్మ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో తులసమ్మ కూతురు, అల్లుడికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు.
పెళ్లి చూపులకు వెళ్తూ సోదరులు..
దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు అన్నదమ్ముల నేపథ్యం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డిలు తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందినవారు. కృష్ణా రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. శేఖర్ రెడ్డి ఒడిశాలో సీఆర్పీఎఫ్ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు.
కాగా, మూడు రోజులు సెలవులు రావడంతో... కృష్ణారెడ్డి ఒడిశాకు వెళ్లాడు. కటక్ నుంచి వీరిద్దరూ తమ స్వస్థలానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
బస్సు ప్రమాదం దురదృష్టకరం: జేసీ ప్రభాకర్ రెడ్డి, మృతులు వీరే
కాగా, మంగళవారం వీరిద్దరికీ గరిడేపల్లి మండలం కోదండరామపురంలో పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. పెళ్లి పీటలు ఎక్కుతారనుకున్న అన్నదమ్ములు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇలా ఈ బస్సు ప్రమాదంలో ప్రయాణికుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.
భార్యను రైలెక్కించి.. తాను బస్సులో..
కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన మధుసూదన్రెడ్డి అనే వ్యక్తి మృతి చెందారు. మధుసూదన్ రెడ్డి తన కుమారుడు అభిషేక్ రెడ్డితో కలిసి భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కు దివాకర్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరాడు. ఈ ప్రమాదంలో అభిషేక్రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు.
మధుసూదన్రెడ్డి తన భార్యను భువనేశ్వర్లో హైదరాబాద్ రైలెక్కించి కొడుకుతో బస్సులో బయలుదేరాడు. భార్య హైదరాబాద్ రైల్వేస్టేషన్లో దిగగానే భర్త మృతి చెందాడని, కుమారుడికి గాయాలయ్యాయని తెలుసుకొని బోరున విలపించింది. రైల్వేస్టేషన్ నుంచే సంఘటనా స్థలానికి బయలుదేరింది.