బాధ ఎందుకు? జగన్ హ్యాపీ: బాబుతో అప్పుడలా జరిగిందని బుట్టా రేణుక
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యురాలు ఓ మీడియా ఛానల్తో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో ఓసారి ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరనున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగిన విషయం తెలిసిందే.

చంద్రబుతో అలా జరిగింది..
ఆ సమయంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు బుట్టా రేణుక, ఆమె భర్త ఆయనను కలిశారు కూడా. అయితే, ఆమె మాత్రం వైసీపీలోనే ఉండిపోయారు. దీనిపై స్పందించిన బుట్టా రేణుక.. అది అనుకోకుండా జరిగిపోయిందని తెలిపారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డితో పాటు తన భర్త కూడా అప్పట్లో చంద్రబాబు నివాసానికి వెళ్లారని, ఆ సమయంలో ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరారని చెప్పారు. ఆ క్షణంలో అలా జరిగిపోయిందని, తన భర్త ఇంతవరకు ఏ పార్టీలో చేరలేదని అన్నారు.

వైసీపీలోనే.. బాబుతో సంబంధం లేదు
తాను మాత్రం చంద్రబాబు ఇంటికి వెళ్లలేదని, ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నానని తెలిపారు. తన భర్తకు చంద్రబాబుతో ఎలాంటి సంబంధం లేదని... ఆయన టీడీపీలో చేరే అవకాశం కూడా లేదని చెప్పారు. ఒక పార్టీ నుంచి గెలుపొందినప్పుడు... ఆ పార్టీలోనే కొనసాగాలనేది తన అభిప్రాయమని రేణుక స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించి, ఇతర పార్టీలోకి జంప్ కావడానికి తాను వ్యతిరేకమని చెప్పారు.

బాధ పడను.. జగన్ హ్యాపీగానే..
తనకు వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ దక్కదని, ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే వార్తలపై కూడా ఆమె స్పందించారు. ఎంపీ కావాలనేది తన కోరిక అని రేణుక తెలిపారు. ఇంతవరకు తమ అధినేత ఈ విషయంపై తనతో ఏమీ చెప్పలేదని ఆమె అన్నారు. జగన్ అన్న ఏదీ ఏదీ చెప్పన్నప్పుడు.. తాను ఎందుకు బాధపడాలని ప్రశ్నించారు. జగన్ ఇప్పటి వరకు తన విషయంలో సంతోషంగానే ఉన్నారని తెలిపారు. అయితే, రేపు ఏం జరుగుతుందనేది దేవుడికే తెలుసు అని అన్నారు.

బలంగా ఉండాలమ్మా...
జగన్మోహన్ రెడ్డి పెద్దలను లెక్క చేయరన్న ఆరోపణల్లో వాస్తవం లేదని బుట్టా రేణుక అన్నారు. ఆయన అందర్నీ గౌరవపూర్వకంగా చూస్తారని తెలిపారు. జగన్ను తాను ఎన్నో సార్లు కలుస్తుంటానని.. ఆయన తనతో ఎంతో అప్యాయంగా మాట్లాడతారని తెలిపారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా సలహాలు ఇస్తుంటారని చెప్పారు. ‘ఇంకొంచం బలంగా ఉండాలమ్మా.. వాయిస్ పెంచాలి' అని చెబుతుంటారని తెలిపారు.

జగన్ అన్నతో చెప్పా.. 2019లో మేమే
ఒకరిని విమర్శించడం తన స్వభావం కాదని జగన్ అన్నతో చెప్పానని.. తానే నేరుగా చెప్పిన తర్వాత ఆయన ఎందుకు ఒత్తిడి చేస్తారని ప్రశ్నించారు. ఈమూడేళ్లలో అన్న తనను బాగా అర్థం చేసుకున్నారని, తనకు అన్ని సమయాల్లో అండగా ఉన్నారని చెప్పారు. వైయస్సార్ గొప్ప నాయకుడని ఆమె అన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అభిృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం విఫలమవుతోందన్నారు. 2014ఎన్నికల్లో స్వల్ప తేడాతో తమ పార్టీ ఓటమిపాలైందని.. 2019లో మాత్రం జగన్ సమర్థ నాయకత్వంలో అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు బుట్టా రేణుక.












Click it and Unblock the Notifications