బుట్టా రేణుక పయనం టీడీపీ వైపేనా?: లోకేష్తో భేటీ, జగన్ ఆగ్రహం
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఆ పార్టీకి గుడ్ బై చెబుతారనే వార్తులు ఊపందుకుంటున్నాయి. ఇందుకు ఓ కారణంగా కూడా ఉంది. అదేమంటే.. హైదరాబాదులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన లోటస్ పాండ్లో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి రేణుక హాజరుకాలేదు.
జగన్ సమావేశానికి డుమ్మా..
త్వరలో జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించేందుకు లోటస్ పాండ్లో పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు జగన్. ఏర్పాటు చేసిన సమావేశానికి రేణుక హాజరుకాకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
లోకేష్తో భేటీ
కాగా, శుక్రవారం కర్నూలు పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ను ఆమె కలిశారు. దీంతో, ఆమె పార్టీ మారడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంపై బుట్టా రేణుక ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆమె ప్రకటన తర్వాత పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
జగన్ అసంతృప్తి...
వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కేవలం 30 నిమిషాల్లోనే ముగిసింది. శనివారం హైదరాబాద్లో ఈ సమావేశం ఆపార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఎంపీల పనితీరుపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
బుట్టా రేణుకపై మండిపాటు!
అంతేగాక కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మంత్రి నారా లోకేశ్ను కలవడంపై ఆయన మండిపడినట్లు తెలిసింది. అంతేగాక, ఆమె సమావేశానికి రాకపోవడంపై ఆరా తీసినట్లు సమాచారం. అలాగే పార్టీలో ఉండాలంటే నియమనిబంధనలు పాటించాల్సిందేనని, వ్యాపారాలకు దూరంగా ఉండాలని, ప్రజలతో కలిసి ఉండాలని ఆయన ఎంపీలకు సూచించినట్లు తెలిసింది.