మీరేం చెప్తే అదే, నేను రెడీ: జగన్ చెప్పారు, బుట్టా రేణుక సై అన్నారు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం తమ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న మార్గంలోనే తాము కూడా నడుస్తామని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక మంగళవారం నాడు అన్నారు.
ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా సాధించే క్రమంలో ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి కూడా తాను వెనుకాడనని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా హోదాను కోరుకుంటున్నారని చెప్పారు.
కానీ, అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోందని ఆమె దుయ్యబట్టారు. భవిష్యత్ తరాలు బాగుండాలంటే ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా బుట్టా రేణుక చెప్పారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం హోదా అవసరమన్నారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాజీనామాల వల్ల హోదా వస్తుందంటే తాము చేస్తామన్నారు. జగన్ ఆదేశిస్తే తాము సిద్ధమని చెప్పారు. కాగా, రానున్న సమావేశాల్లో హోదాపై తేల్చకుంటే తమ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ చెప్పారు. బుట్టా కూడా రాజీనామాకు సై అన్నారు.