చర్చకు రండి: వెంకయ్యపై నిప్పులు చెరిగిన సిఆర్
విజయవాడ: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య శనివారంనాడు రాజమండ్రిలో నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్నికల సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై బహిరంగ చర్చకు రావాలని ఆయన వెంకయ్య నాయుడిని సవాల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఏ ఉద్దేశంతో ఇస్తామని అన్నారని ఆయన అడిగారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతారా అని ఆయన అడిగారు. వెంకయ్య నాయుడు చెప్పే కుంటి సాకులు ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా వెంకయ్య నాయుడిపై విరుచుకుపడ్డారు.
రాష్ట్రానికి రావాల్సిన వాటాలు తేవడంలో వెంకయ్య నాయుడు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామన్న టిడిపి, బిజెపిలు మాట మార్చాయని ఆయన దుమ్మెత్తిపోశారు. అధికారం కోసం తాము ప్రజల ముందుకు రాలేదని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైదరాబాదులో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదవిలో లేనప్పుడు ఢిల్లీలో ధర్నా చేసిన చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రం చేస్తున్న అన్యాయంపై పెదవి విప్పకపోవడం దారుణమని ఆయన అన్నారు
అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రజలపై భారం మోపుతన్నారని ఆయన విమర్సించారు. ఎపికి ప్రత్యేక హోదా తీసుకునిరాకపోతే వెంకయ్య నాయుడు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం ఫబ్రవరి 18వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ాయన తెలిపారు.