వెంకయ్యకు చిరు వర్గం నేత రామచంద్రయ్య కితాబు
హైదరాబాద్/ విజయవాడ: కేంద్ర మంత్రి చిరంజీవి వర్గానికి చెందిన తాజా మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకుడు సి. రామచంద్రయ్య రాష్ట్ర విభజన విషయంలో బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడిని అభినందించారు. తెలంగాణ బిల్లుపై చర్చ సమయంలో వెంకయ్య నాయుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి, సీమాంధ్రకు న్యాయం జరిగేలా చూశారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వెంకయ్య నాయుడికి అభినందనలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రతిపక్షం అధికార పక్షంపై విమర్శలు చేయవచ్చు గానీ దానికే పరిమితమై విచ్ఛిన్నకరమై పాత్ర పోషించకూడదని, దురదృష్టవశాత్తు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు విచ్ఛిన్నకరమైన పాత్రను పోషించాయని ఆయన అన్నారు. సీమాంధ్ర అబివృద్ధి విషయంలో బిజెపి బాధ్యతతో వ్యవహరించిందని ఆయన కొనియాడారు.
తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమన్యాయమంటూ ఎదురు తిరిగారని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలని సూచించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమైక్యమంటూ మాట మార్చారని ఆయన అన్నారు.
సమస్య పరిష్కారానికి చంద్రబాబు చెప్పిన విధానాన్నే కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి ముందుకు వచ్చిందని, అయితే చంద్రబాబు తర్వాత అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయన అన్నారు. సమన్యాయమంటే చంద్రబాబుకు తెలుసో, లేదో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. సమన్యాయమంటే ఏమిటని అడిగితే అయోమయంగా మాట్లాడారని, చంద్రబాబు అయోమయంలో ఉన్నారో, కావాలనే అయోమయంగా ఉన్నట్లు నటించారో తెలియదని ఆయన అన్నారు.
శక్తికి మించి పోరాటం చేశాం: అశోక్ బాబు
రాష్ట్ర సమైక్యత కోసం శక్తికి మించి పోరాటం చేశామని ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు తెలిపారు. ఉద్యమంలో గెలిస్తే ఏ తప్పులు కనిపించవు గానీ, ఓటమి చెందితే చెడు ప్రచారం చేయడం మామూలే అని ఆయన శనివారం మీడియాతో అన్నారు. ఎవరేమన్నా రాష్ట్ర సమైక్యత కోసం చిత్తశుద్ధితో, నిజాయితీగా, చివరి వరకు పోరాటం చేశామన్న సంతృప్తి తమకుందన్నారు.
విభజన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయంగా ఎవరు పనిచేసినా తమ మద్దతు ఉంటుందన్నారు. విభజన విషయంలో కాంగ్రెస్, బిజెపి వైఖరిని ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించేంది లేదని, ఇరు పార్టీల నయవంచనకు తెలుగు జాతి విడిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం, అధికార పక్షం కలిసి 23 నిమిషాల్లో రాష్ట్రాన్ని విభజించడం దారుణమైన చర్య అని అశోక్బాబు మండిపడ్డారు.