బెజవాడ 'కాల్మనీ' దందా: ప్రజా ప్రతినిధులకు అమ్మాయిలను ఎరగా?
అమరావతి: విజయవాడలో వెలుగు చూసిన కాల్మనీ దందాలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఈ కాల్మనీ దందాలో ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాల్మనీ దందాలో బెజవాడకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తోంది.
ఈ కాల్మనీ దందాలో పెట్టుబడులు పెట్టిన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ముఠా సభ్యులు రెండు ప్రత్యేకమైన ఆఫర్లను ఇస్తారు. ఇందులో ఒకటి ప్రతి నెలా రూ. 10 లక్షలు వడ్డీగా చెల్లించడం. రెండోది అమ్మాయిలను పంపించడం. అంతేకాదు పెట్టుబడి పెట్టిన ఎమ్మెల్యేలకు విదేశాల్లో విలాసాలను సైతం రుచి చూపిస్తారు.

ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సింగపూర్లో విలాసాలు చేస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ దందాలో పెట్టుబడి పెట్టే ముందు దీనిపై ముఠా సభ్యులు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతారు. కాల్మనీ ముఠా సభ్యుల బారిన పడిన బాధితుల్లో సుమారు 200 నుంచి 300 మంది వరకు మహిళలు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ కాల్మనీ దందాలో ప్రధాన సభ్యుడిగా పోలీసులు అనుమానిస్తున్న యలమంచిలి రాము అనే వ్యక్తి గతంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఈ కాల్మనీ ముఠాలో ప్రధాన సభ్యుడైన యలమంచిలి రాము అనే వ్యక్తి గతంలో కూడా హనుమాన్ జంక్షన్లో రూ. 60 ఐపీ పెట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ కేసులో యలమంచిలి రాము, భవానీ శంకర్, చెన్నుపాటి నివాస్, విద్యుత్ శాఖ డీఈ సత్యానంద్, టీడీపీ నేతలు వెనిగళ్ల శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్, దూడల రాజేష్పై కేసులు నమోదయ్యాయి. వీరందరిపై.... ఐపీసీ సెక్షన్ 420, 376, 354a(1)(2), 384, 506, రెడ్విత్ 34, 120(బీ) కింద విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిందితులంతా విజయవాడ పరిసర ప్రాంతాల్లోని అధికార పార్టీ నేతల అనుచరులుగా గుర్తించారు. కాగా కీలక సూత్రధారి అయిన వెనిగళ్ల శ్రీకాంత్కు విజయవాడ సమీప ఎమ్మెల్యేతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వెలువెత్తాయి. కాల్మనీ ముఠా డబ్బుతో సదరు ఎమ్మెల్యేను రెండు సార్లు విదేశాలకు పంపినట్టు పోలీసులు తెలిపారు.
ఆ తర్వాత బెజవాడకు చేరుకున్న అతడు బిర్యానీ షాపు పెట్టి అక్కడ కూడా కొంతమందిని మోసం చేసినట్లు సమాచారం. పటమటకు చెందిన కాల్మనీ గ్యాంగ్పై ఓ మహిళ సీపీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. ఈ కాల్మనీ వ్యవహారం మొత్తం వందల కోట్ల రూపాయాల్లో టర్నోవర్ జరుపుకుంటుందని తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు.
పెట్టుబడులు పెట్టిన స్థానిక ప్రజాప్రతినిధులకు ఆడపిల్లలను ఎరగా వేయడం ఈ ముఠా సభ్యుల పని. అప్పు తీసుకున్న మహిళలు దానిని తీర్చడం కాస్తం ఆలస్యం అయితే ఇంటికి వెళ్లి మరీ అత్యంత నీచంగా నోటికి ఇష్టం వచ్చినట్లు దూషిస్తారని విచారణలో వెల్లడైంది. అంతేకాదు తీసుకున్న అప్పు ఇస్తావా? లేదంటే నీ భార్యను పంపిస్తావా? అని పలుమార్లు దబాయించిన సందర్భాలు కోకల్లలు.
అప్పు తీర్చలేని మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసే ఈ ముఠా సభ్యులు, అవసరమైతే బౌన్సర్ల సహాయంతో కొట్టేందుకు కూడా వెనుకాడరు. బ్లాక్ మెయిల్ చేస్తూ అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కాల్ మనీ ముఠా సభ్యులు ఉదయం రూ. 800 ఇచ్చి సాయంత్రానికి రూ. 1000లను బాధితుల నుంచి వసూలు చేస్తునట్లుగా తెలుస్తోంది.
డబ్బులు ఇవ్వని పక్షంలో ఆకుటుంబాలకు చెందిన మహిళను బెదిరించడం, భయపెట్టి వ్యభిచారంలోకి దింపడం లాంటివి చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని వీడియోలుగా చేసి డబ్బు సంపాదించుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఈ క్రమంలో కాల్మనీ ముఠా సభ్యులు బెజవాడ నుంచి పరారయ్యారు. ఇళ్లకు తాళాలు వేసి కుటుంబాలతో సహా మాయమయ్యారు. దీంతో నిందతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications