కాల్ మనీ షాక్: 4 లక్షలిచ్చి కోటి తీసుకున్నారు, ముగ్గురు నిందితులకు బెయిల్
విజయవాడ: కాల్ మనీ రాకెట్ కుంభకోణంలో తవ్విన కొద్ది షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, మరో భాస్కర రావు అనే కాల్ మనీ వ్యాపారి రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చి, రూ.కోటి ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
భాస్కర రావు అనే వ్యక్తి ఓ వృద్ధ దంపతులకు నాలుగు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. దానికి వడ్డీతో సహా రూ.కోటి ఆస్తులు తీసుకున్నాడు. తుమ్మలపాలంలోని వృద్ధ దంపతుల భూమిని కబ్జా చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాల్ మనీ నిందితులకు బెయిల్
కాల్ మనీ కేసులో మరికొంతమందికి మంగళవారం బెయిల్ లభించింది. యమలమంచిలి రాము, భవానీ శంకర్, దూడల రాజేశ్లకు బెజవాడ రెండో చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం షరతులలతో కూడిన బెయిల్ మంజూరు ఇచ్చింది. కొన్నిరోజుల కిందట తొమ్మిది మందికి బెయిల్ లభించింది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లాది విష్ణును కస్టడీకి కోరుతూ విజయవాడ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. కాగా ఆయన బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఇంకా తీర్పు వెల్లడించలేదు.
దాడి చేశారని ఫిర్యాదు
తనపై దాడి చేశారని ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై చిలకలపూడి స్టేషన్లో కేసు నమోదైంది. మందుల గూడెంకు చెందిన స్వామిపై పాత గొడవలను దృష్టిలో ఉంచుకుని సమీప ప్రాంతానికి చెందిన వెంకన్నతో పాటు మరో ఇరువురు వ్యక్తులు దాడి చేశారు. దాడిలో గాయపడిన స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణాజిల్లాలోని మండవల్లి మండలంలోని మూడుతాళ్లపాడులో సంచలనం సృష్టించిన వివాహిత అనుమానాస్పద మృతి కేసులో నిందితులుగా భావిస్తున్న వారిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
ఈ నెల 10న మూడతాళ్లపాడుకు చెందిన కమతం సంధ్య అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందింది. ఈ కేసును ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు. సంధ్య మృతికి కారణం ఆమె భర్త, అత్తమామలేనని, వారు మానసికంగా, శారీరకంగా హింసించారనే అనుమానంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.