అమరావతికి ముంపుంది: సంతకం ఎందుకు పెట్టావని ఐవైఆర్కు ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు.ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధాని ప్రాంతానికి ఎంచుకోవడం సహేతుకం కాదని ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు.భవిష్యత్తులో రాజధాని వరద నీటిలో మునిగే ప్రమాదం ఉందన్నారు.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును బ్రహ్మణ కార్పోరేషన్ చైర్మెన్ పదవి నుండి తొలగించిన తర్వాత ప్రభుత్వంపై విమర్శల దాడిని ఇంకా పెంచారు.
ఐవైఆర్ కృష్ణారావును ప్రభుత్వం గౌరవించి తగు బాధ్యతలు కట్టబెట్టినా కానీ, ఆయన మాత్రం దాన్ని నిలుపుకోలేదని టిడిపి నేతలు ఆరోపణలు గుప్పించారు.టిడిపి నేతలు కొన్ని సమయాల్లో ఐవైఆర్ కృష్ణారావుపై కొన్ని సమయాల్లో తమ దాడి తీవ్రతను పెంచారు.
ఐవైఆర్ కృష్ణారావు కూడ ఏ మాత్రం తగ్గలేదు. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడకు, మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు మధ్య ఎక్కడ బెడిసిందో తెలియదు . కానీ, ప్రభుత్వంపై మాత్రం ఐవైఆర్ తన దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆదివారం నెల్లూరులో పర్యావరణ పరిరక్షణపై ఏర్పాటు చేసిన ఓ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజధాని నిర్మాణం విషయమై కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి రాజధానికి అనువైన ప్రాంతం కాదు
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రాజధాని అమరావతి నిర్మాణానికి నిర్దేశించిన ప్రాంతం సహేతుకం కాదని మాజీ ఛీప్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. రాజధాని అమరావతి మునక ప్రాంతమని, భవిష్యత్తులో వరద ముంపునకు గురయ్యే అవకాశముందని హెచ్చరించారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఇటీవల వర్షాలకు వచ్చిన వరద కంటే పదిరెట్లు ప్రమాదకర స్థాయిలో అమరావతిలో వరదలు వచ్చి మునిగే అవకాశముందని హెచ్చరించారు.
పర్యావరణానికి విఘాతం
అమరావతిలో రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణ పరిరక్షణకు తీవ్ర విఘాతం కలిగి భవిష్యత్తులో కాలుష్యం బారిన పడుతుందని అన్నారు. ఇన్ని అవరోధాలు కనిపిస్తున్నా ప్రభుత్వం ముందుకెళుతోందని విమర్శించారు. ప్రభుత్వం రాజధాని నిర్మాణం విషయంలో నిర్లక్ష్యంగా ముందుకెళ్తోందని ఐవైఆర్ కృష్ణారావు ఆరోపణలు చేశారు.
ఐవైఆర్ కృష్ణారావు ప్రసంగానికి అడ్డుకట్ట
నెల్లూరులో సదస్సులో ఐవైఆర్ కృష్ణారావు ప్రసంగించే సమయంలో కొందరు పర్యావరణ ప్రేమికులు సభలో గందరగోళం సృష్టించారు. అమరావతి రాజధాని ఎంపిక సమయంలో తొలి సంతకం పెట్టిన వ్యక్తి అప్పటి ప్రధానకార్యదర్శి మీరే కదా అంటూ ఎదురు ప్రశ్నించారు. ఈ సమయంలో సభలో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. చివరకు కొద్దిసేపు మాట్లాడిన కృష్ణారావు కొందరిపై అసహనం వ్యక్తం చేశారు.
ఐవైఆర్ కృష్ణారావుపై సోమిరెడ్డి విమర్శలు
తాను ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా ఉన్న సమయంలో ఆమోదించిన పనులనే ప్రస్తుతం తిరిగి విమర్శించడం ఎంత వరకు సబబో మాజీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆలోచించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావుకు పదవీకాలం పూర్తయిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగించిన ప్రభుత్వంపైనే విమర్శలకు దిగడం ఆయన నైతికతను తెలియచేస్తోందన్నారు.