క్యాపిటల్ వార్..30న జనసేన కీలక సమావేశం..పవన్ ఏం చెయ్యబోతున్నారో!!
Recommended Video
ఏపీలో మూడు రాజధానుల రగడ కొనసాగుతుంది. మూడు రాజధానుల ప్రతిపాదన సీఎం జగన్ మోహన్ రెడ్డి పెట్టిన నాటి నుండీ నేటివరకు అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు ఉద్యమం కొనసాగిస్తూనే వున్నారు. రాజధాని అమరావతిని మార్చొద్దని డిమాండ్ వినిపిస్తూనే ఉన్నారు. ఇక మూడు రాజధానుల ప్రకటనపై ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రైతులు కొనసాగిస్తున్న ఆందోళనలలో కనిపించింది కానీ ఆ తర్వాత మళ్ళీ మాట్లాడింది కానీ లేదు. ఇప్పుడు మరోమారు ఆయన కార్యాచరణ రూపొందించబోతున్నారు.
ఈ నెల 30న జనసేన కీలక భేటీ
ఇక తాజాగా నేడు క్యాబినెట్ భేటీ జరుగుతున్న తరుణంలో ఏం నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుండగా జనసేన అధినేత పవన్ ఈ నెల 30న పార్టీ కార్యాలయంలో కీలక భేటీ నిర్వహిస్తుండటం క్యాపిటల్ వార్ విషయంలో పవన్ ఏం చెయ్యబోతున్నారు అన్న ఆసక్తిని కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇటీవల ఏపీలో అందుబాటులో లేరని ఆయన తన కుటుంబంతో వెకేషన్కు వెళ్ళారని ప్రచారం జరిగింది.
ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళిన పవన్ ... తాజా పరిణామాలతో మళ్ళీ రంగంలోకి
తాజాగా ఆయన తన ఫ్యామిలీ వేకేషన్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత బాక్సింగ్ డే నాడు రంగంలోకి దిగారు. జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని గురువారం పార్టీ సీనియర్ల భేటీలో నిర్ణయించారు.రాజధాని వ్యవహారంలో రాష్ట్రంలో పరిస్థితులు గందరగోళంగా ఉన్న నేపధ్యంలో జనసేన నాయకుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.
విస్త్రుత స్థాయి సమావేశానికి రావాలని జనసేన నేతలకు పిలుపు
ఈ నెల 30వ తేదీన పవన్ కళ్యాణ్ అధ్యకతన ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరగనుంది. ఇక కార్యాలయానికి ముఖ్య నేతలంతా రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. జనసేన పొలిట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీ, పార్టీ వ్యూహాత్మక కమిటీ, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ, ముఖ్య నేతలు హాజరు కావాలని ఆదేశించారు జనసేనాని.
రైతుల ఆందోళన , మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు తదితర అంశాలపై చర్చ
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తాజా పరిస్థితులు, అమరావతి గ్రామాల ప్రజలు, రైతుల ఆందోళన, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు, రాష్ట్ర సమగ్రత వంటి అంశాలను విస్తృత స్థాయి సమావేశానికి ఎజెండాగా ఖరారు చేశారు.ఇక ఈ నేపధ్యంలో ఈ అంశాలపై జనసేన స్టాండ్, పార్టీ పరంగా నిర్వహించవలసిన కార్యక్రమాలు తదితర అంశాలపై కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
అన్న చిరు వ్యాఖ్యలతో తమ్ముడికి పెరిగిన క్రేజ్ ..30న ఏం నిర్ణయం తీస్కుంటారో ?
ఒకవైపు మూడు రాజధానుల ప్రతిపాదనను పవన్ కళ్యాణ్ తీవ్రంగానే వ్యతిరేకించారు. ఒక్క రాజధానికే గతి లేదు మూడు రాజధానులా అని మండిపడ్డారు. ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి మాత్రం మూడు రాజధానుల ప్రతిపాదనను స్వాగతించటం రాజధాని రైతులకు ఏ మాత్రం నచ్చలేదు. దీంతో అమరావతి ఏరియా ప్రజల్లో చిరంజీవి విషయంలో అసహనం వ్యక్తం కాగా పవన్ కళ్యాణ్ పై ప్రజల్లో నమ్మకం పెరిగిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా 30వ తేదీన జనసేన పార్టీ సమావేశంలో తాజా పరిస్థితులపై ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది.