రాజధాని ఎఫెక్ట్: తుళ్లూరులో కార్ల షోరూంలు, అద్దెకు..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని తుళ్లూరు కొత్త కళతో కళకళలాడుతోంది. రోడ్లకు ఇరువైపుల ఏర్పాటు చేసిన టెంట్లలోనే ఖరీదైన కార్ల కంపెనీలతో పాటు బిర్యానీ హోటళ్లు కూడా వెలిశాయి. రాజధానిగా ఏర్పాటు కాబోతున్న తుళ్లూరులో భూముల క్రయవిక్రయాలు భారీగా పెరిగిపోయాయి.
భవిష్యత్తులో భారీ ఆదాయాలు వస్తాయన్న భావనతో పెద్ద ఎత్తున రియల్టర్లు భూములను కొనుగోలు చేస్తున్నారు. దీంతో డబ్బులతో తుళ్లూరు కళకళలాడిపోతోంది! ఈ నేపథ్యంలో అక్కడి మార్కెట్ను చేజిక్కించుకునేందుకు వివిధ కంపెనీలు వస్తున్నాయి.
ప్రధానంగా కార్లకు మంచి డిమాండ్ లభిస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో కార్లు అమ్ముడుపోతున్నాయంటున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండల పరిధిలోని తుళ్లూరు, పెదపరిమి గ్రామాల్లో శనివారం నాలుగు ప్రముఖ సంస్థలు కార్ల ప్రదర్శన నిర్వహించాయి. ఆసక్తి చూపిన వారికి అక్కడికి అక్కడే వాహనాలు నడిపి పరీక్షించుకునే అవకాశం కల్పించాయి.
ద్విచక్ర వాహన సంస్థ ఏకంగా ఓ దుకాణం ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఇక్కడి ప్రజలు వాహనాలు కొనేందుకు గుంటూరు, విజయవాడ నగరాలకు వెళ్లేవారు. ఇప్పుడు ఇక్కడే ఉన్నత శ్రేణి కార్లు తెస్తున్నారు. భూములు విక్రయించిన పలువురు రైతులు పలు కంపెనీల కార్లు పరిశీలించి కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు.
మరోవైపు, అక్కడికి తండోపతండాలుగా వస్తున్న రియల్టర్ల ఆకలి తీర్చేందుకు ఏర్పడ్డ హోటళ్లు కూడా భారీగానే లాభాలు ఆర్జిస్తున్నాయి. పెద్ద ఎత్తున భూముల క్రయవిక్రయాలు సాగుతున్న నేపథ్యంలో నోట్లు లెక్కించేందుకు ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగదు లెక్కింపు కేంద్రాలు కూడా అద్దెకు ఇస్తున్నారు.
కాగా, పదిరోజుల కిందటి వరకు భూసమీకరణ చేసే గ్రామాల్లో ఎకరా రూ.70 లక్షల నుండి రూ.90 లక్షల మధ్య బేరాలు జరిగాయి. తాజాగా రూ.కోటి ఇస్తామన్నా రైతులు భూములు విక్రయించేందుకు ఆసక్తి కనబరచడం లేదంటున్నారు. భూసమీకరణ తర్వాత అభివృద్ధి చేసిన స్థలాలు విక్రయిస్తే ఎక్కువ మొత్తం వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో ఎవరు ముందుకు రావడం లేదని అంటున్నారు. మరోవైపు, కొందరు ఇక్కడ భూములు విక్రయించి పల్నాడులో కొంటున్నారు.