కత్తి, రోకలిబండను ఆయుధంగా ఉపయోగించండి: మహిళలకు నన్నపనేని సూచన
ఆత్మ, మాన రక్షణ కోసం మహిళలు రోకలి బండైనా, కత్తినైనా ఆయుధంగా చేసుకొని మృగాళ్ళను ఎదిరించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి సూచించారు.
శ్రీకాకుళం: ఆత్మ, మాన రక్షణ కోసం మహిళలు రోకలి బండైనా, కత్తినైనా ఆయుధంగా చేసుకొని మృగాళ్ళను ఎదిరించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి సూచించారు.
శ్రీకాకుళంలో గురువారం నాడు ఏర్పాటుచేసిన మహిళా సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు.
వీటిని నియంత్రించేందుకు అన్ని విధాలుగా కమిషన్ చర్యలు తీసుకొంటుందన్నారు. గతంలో తాను మహిళలకు కత్తులు వెంటబెట్టుకొని వెళ్ళండని చెప్పడంపై కొందరు విమర్శలు గుప్పించారని, అయినా తాను మళ్ళీ అదే విషయాన్ని గట్టిగా చెబుతున్నానన్నారు.
ప్రస్తుతం అన్నివర్గాలపై తీవ్ర ప్రబావం చూపుతున్న సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లపై నియంత్రణ అవసరమన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. ఇక సినిమాల్లో లాగానే టీవి సిరియళ్ళకు కూడ సెన్సార్ ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇక రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల జరిగిన చింతపల్లి ఘటనలో ఆరుగురిని అరెస్టు చేశారని చెప్పారు. మరో ఇద్దరిని కూడ అరెస్టు చేయాల్సి ఉందన్నారామె.