మరో వివాదంలో ‘కృషి’ వెంకటేశ్వర్రావు...ఆస్తి కోసం బెదిరిస్తున్నాడని కేసు పెట్టిన తల్లిదండ్రులు
విజయవాడ: కొసరాజు వెంకటేశ్వర్రావు పై కేసు నమోదైంది. ఎవరీ కొసరాజు వెంకటేశ్వరరావు అనుకుంటున్నారా...అదేనండి...కృషి బ్యాంకు ఛైర్మన్...'కృషి' వెంకటేశ్వర్రావు గా కొంతకాలం బాగా పాపులర్...ఆ తరువాత చాలా అన్ పాపులర్ కూడా అయిన వెంకటేశ్వర్రావు.
ఇంతకాలం తరువాత మరోసారి ఆయన మరో వివాదంతో వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆయనపై కన్నతల్లి దండ్రులే కేసు పెట్టారు. ఇంతకీ కొడుకుపైనే కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో తమపై దాడి చేసి బెదిరించాడని తల్లి, దండ్రులు కొసరాజు జయసింహ,బేబి సరోజినీ తమ ఇద్దరు కుమారులు వెంకటేశ్వరరావు, వేణుగోపాల్ లపై ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు ఇద్దరు కొడుకులపై పెదపారుపూడి పోలీసులు కేసు నమోదుచేశారు.
తల్లిదండ్రుల ఆవేదన...
కృషి కోఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణం కేసులో ఉన్న తమ కుమారులు వెంకటేశ్వరరావు, వేణుగోపాల్ ఇద్దరు తమను ఆస్తుల కోసం తమను వేధిస్తున్నారని వారి తండ్రి కొసరాజు జయసింహ ఆరోపించారు. కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడలో తన పేరిట 20 ఎకరాలు, తన భార్య బేబీ సరోజిని పేరిట ఆరెకరాలు ఉందన్నారు. కృషి కోపరేటివ్ బ్యాంక్ మూసివేసినప్పటి నుంచి కోర్టు కేసులు నడుస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఉన్న తన కొడుకులు వెంకటేశ్వరరావు, వేణుగోపాల్లు హైదరాబాద్లో నివసిస్తున్నారని, అక్కడ వారికున్న ఆస్తులను ప్రభుత్వం సీజ్ చేసిందన్నారు. గత నెలరోజులుగా కుమారులు ఇద్దరూ కలసి తమను ఆస్తి ఇవ్వకపోతే చంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు.
దాడి...బెదిరింపు...
ఇద్దరు కొడుకులు గురువారం సాయంత్రం ఇంటికి వచ్చి తమపై చేయిచేసుకున్నారని, తీవ్రంగా దూషించారని తండ్రి జయసింహా వివరించారు. ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు, పాస్ పుస్తకాలు, ఈసీ కాపీలను రెండు రోజుల్లో ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించి వెళ్లారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్న అద్దాలు కూడా పగలకొట్టారని జయసింహ చెప్పారు. తమ కుమార్తె, అల్లుడిని కూడా హతమారుస్తామని హెచ్చరించారన్నారు. ఈ విషయపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఒకనాటి కృషి స్కామ్...
కృషి బ్యాంకు పేరుతో చాలా కాలం క్రితం వెంకటేశ్వర్రావు ఓ బ్యాంకు పెట్టాడు. డిపాజిటర్లకు ఎక్కువ మొత్తంలో వడ్డీ(16.5 శాతం) ఇస్తానని ఆశ చూపి భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు. కుంభకోణం వెలుగులోకి రావడంతో చాకచక్యంగా 2001 జూలైలో భార్యతో కలిసి యూకే పారిపోయాడు. అక్కడ పౌరసత్వం రాకపోవడంతో మళ్లీ థాయిలాండ్కు పారిపోయాడు. ఈ విషయం హైదరాబాద్ పోలీసులకు తెలియడంతో బ్యాంకాక్ పోలీసులు, ఇంటర్ పోల్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో 2005లో బ్యాంకాక్లో వెంకటేశ్వర రావును అరెస్ట్ చేశారు. 2006, జూన్లో హైదరాబాద్కు తీసుకువచ్చారు. ఇంత కాలానికి మళ్ళీ కృషి వెంకటేశ్వర్రావు ఇప్పుడు ఈ వివాదంతో మళ్లీ వార్తల్లోకి ఎక్కారు.
పోలీసు కేసు నమోదు...
ఇద్దరు కుమారులు దాడి చేసి బెదిరించడంతో కొడుకులు వెంకటేశ్వరరావు, వేణుగోపాల్ పై తల్లిదండ్రులే కేసు పెట్టారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడకు చెందిన కోసరాజు జయసింహ, బేబి సరోజినీలపై వారి కొడుకులైన వెంకటేశ్వరరావు, వేణుగోపాల్ పై పెదపారుపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదుచేశారు.