నటుడు పృథ్వీరాజ్ కు కోర్టు షాక్ - గెంటేశారంటూ కోర్టుకెక్కిన భార్య..!!
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గా సినీ ఇండస్ట్రీలో ఫేమ్ సంపాదించిన నటుడు పృథ్వీరాజ్ ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆయన సతీమణి దాఖలు చేసిన కేసులో కోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్ తో 1984లో వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే, తన భర్త పృథ్వీరాజ్ తనను మానసికంగా వేధిస్తున్నారని.. సెక్షన్ 498A గృహహింస చట్టం కింద శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పృథ్వీరాజ్ పై భార్య ఫిర్యాదు
తన భర్త నుంచి భరణం ఇప్పించాలని 2017 జనవరి 10న ఆమె విజయవాడ ఫ్యామిలీ కోర్టులో కేసు దాఖలు చేశారు. పృథ్వీరాజ్ సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు రూ 30 లక్షల వరకు సంపాదిస్తున్నారని శ్రీలక్ష్మీ తన పిటీషన్ లో పేర్కొన్నారు. పృథ్వీరాజ్ కు సంబంధించిన ఆదాయ మార్గాలను..ఆధారాలను శ్రీలక్ష్మీ కోర్టుకు నివేదించారు.
తనకు నెలకు రూ పది లక్షల రూపాయాల మేర భరణం ఇప్పించాల్సిందిగా కోర్టను అభ్యర్ధించారు. దీనికి సంబంధించి కోర్టులో సుదీర్ఘంగా విచారణ సాగింది. దీనికి సంబంధించి తన పిటీషన్ లో శ్రీలక్ష్మి అనేక అంశాలను చేర్చారు. తమ వివాహం తరువాత విజయవాడలో ఉన్న సమయంలోనే పృథ్వీరాజ్ తరచూ సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్లే వారని పేర్కొన్నారు.
ప్రతీ నెలా భరణం చెల్లించాలని కోర్టు తీర్పు
ఆ సమయంలో చేసిన ఖర్చు మొత్తం తన తల్లి తండ్రులే సమకూర్చారని వివరించారు. కానీ, పృథ్వీరాజ్ తనను తరచూ వేధించే వారని ఫిర్యాదు చేసారు. తనను తన భర్త 2016 ఏప్రిల్ 5న ఇంటి నుంచి గెంటేశారని, దీంతో తాను పుట్టింటికి చేరుకున్నానని చెప్పుకొచ్చారు. సినిమాలతో పాటుగా సీరియళ్లలో నటిస్తూ నెలకూ రూ 30 లక్షల వరకు ఆదాయం ఆర్జిస్తున్నారని చెప్పారు. తన భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలని కోరారు. ఈ కేసు విచారించిన విజయవాడ 14వ అదనపు జిల్లా కోర్టు (కుటుంబ న్యాయస్థానం) న్యాయమూర్తి శ్రీలక్ష్మికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ప్రతీ నెలా శ్రీలక్ష్మికి రూ. 8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించారు. కేసు దాఖలు చేసినప్పటి నుంచి ఆ మొత్తాన్ని చెల్లించాలని తీర్పులో స్పష్టం చేసారు.
జనసేన నుంచి పోటీకి సిద్దమంటూ
ప్రతీ నెలా 10వ తేదీ నాటికి ఈ మొత్తం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. పృథ్వీరాజ్ వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. జగన్ సీఎం అయిన తరువాత పృథ్వీరాజ్ కు ఎస్వీబీసీ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చారు. అయితే, లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన్ను ఆ హోదా నుంచి తొలిగించారు. అప్పటి నుంచి పృథ్వీరాజ్ రాజకీయంగా డైలమాలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం మెగా బ్రదర్ నాగబాబును కలిసి పృథ్వీరాజ్ తాను జనసేన లో చేరేందుకు సిద్దమంటూ ఆ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి పృథ్వీరాజ్ తన సొంత నియోజకవర్గం తాడేపల్లగూడెం నుంచి పోటీకి సిద్దమవుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.