అచ్చెన్నాయుడుపై కేసు నమోదు - పోలీసులపై అసభ్యంగా..!!
కుప్పంలో పోలీసు అధికారుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడు పై కేసు నమోదైంది.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పై పోలీసు కేసు నమోదైంది. కుప్పం నుంచి పార్టీ నేత నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కోసం అచ్చెన్నాయుడు సహా పార్టీ నేతలంతా కుప్పం చేరుకున్నారు. నిర్ణయించిన ముహూర్తం మేరకే లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. అయితే, ముందు నుంచి లోకేశ్ పాదయాత్రకు అనుమతి..బందో బస్తు పైన రాజకీయ వివాదం కొనసాగింది. చిత్తూరు జిల్లా పోలీసులు కొన్ని షరతులతో లోకేశ్ పాదయాత్రకు అనుమతి ఇచ్చారు. పాదయాత్ర ప్రారంభం వేళ అచ్చెన్నాయుడు కీలక బాధ్యతలు తీసుకున్నారు.
అదే సమయంలో సభలో మాట్లాడుతూ పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసారు. 500 మంది పోలీసులతో భద్రత కల్పించామని పోలీసులు చెప్పటం పైన అచ్చెన్న స్పందించారు. ఆ సమయంలో పోలీసుల గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై అధికారులు సీరియస్ అయ్యారు. పోలీసుల పైన అసభ్య పదజాలం ప్రయోగించటం పైన కేసు నమోదు చేసారు. కుప్పం ఒన్ టౌన్ ఎస్సై రవి కుమార్ ఈ మేరకు అచ్చెన్నాయుడు అసభ్య పదజాలం ప్రయోగించటం పైన ఫిర్యాదు చేసారు. కుప్పం పోలీసు స్టేషన్ లో అచ్చెన్నాయుడు పైన కేసు నమోదు చేసారు. లోకేష్ పాదయాత్ర సభలో పాల్గొన్న అచ్చెన్నాయుడు పోలీసులు..ప్రభుత్వం పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
రాష్ట్రంలో ఏ వర్గం కూడా ప్రశాంతంగా లేదన్నారు.లోకేష్ అధికారం ఆశించి ఈ యాత్రకు పూనుకోలేదని చెప్పారు. భావి తరలా భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు ఈ యువగళం పాదయాత్ర ప్రారంభించారని చెప్పుకొచ్చారు. పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరధం పట్టారని వివరించారు. యాత్ర ప్రారంభాన్ని సక్సెస్ చేసిన ప్రతీ ఒక్కరికీ చంద్రబాబు తరపున ధన్యవాదాలు చెబుతున్నట్లుగా అచ్చెన్న పేర్కొన్నారు. ఇక.. పోలీసుల పైన చేసిన వ్యాఖ్యల ఫలితంగా అచ్చెన్న పైన కుప్పంలో కేసు నమోదు చేయటం పైన ఇప్పుడు టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.