చిక్కుల్లో మంత్రి పీతల సుజాత: ఇంటి వద్ద నోట్ల సంచీ
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ, సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చిక్కుల్లో పడ్డారు. ఆమె ఇంటి ఆవరణలో రూ. 10 లక్షల నగదు ఉన్న సంచీని మంగళవారంనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై పి. శ్యాంసుదర్ ఆ విషయాన్ని ధ్రువీకరించారు
మంత్రి సుజాతకు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటి ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ సంచీని వదిలి వెళ్లారు. దానికి సమాచారాన్ని ఆ ఇంట్లో పనిచేస్తున్న చికిలే సుబ్బారావు అనే వ్యక్తి పోలీసులకు అందించారు.
సంచీలో రూ. 10 లక్షల నగదుతో పాటు తాడేపల్లి గూడేనికి చెందిన కార్ని లక్ష్మి అనే యువతికి చెందిన డిఎస్సీ హాల్ టికెట్, సర్టిఫికెట్లు కూడా ఉన్నాయని, దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు. కాగా, పోలీసులు ఓ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా, నోట్ల కట్టల సంచీపై పీతల సుజాత పొంతన లేని సమాధానాలు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ డబ్బుల సంచీతో తమకు ఏ విధమైన సంబంధం లేదని ఆమె అన్నారు. శుభలేఖ ఇచ్చేందుకు వచ్చి ఎవరో మరిచిపోయి ఉంటారని ఆమె అన్నారు. దళిత మంత్రినైన తన పైన కుట్ర జరుగుతోందని పీతల సుజాత అన్నారు. ఇందులో తన తండ్రి పాత్ర ఏం లేదన్నారు. తన పైన కుట్ర ఎవరిదనేది విచారణలో తేలుతుందన్నారు.
అదే సమయంలో డబ్బు సంచీని తన ఇంటి ఆవరణలో వదిలి వెళ్లడాన్ని కావాలని చేసిన కుట్రగా భావిస్తున్నట్లు కూడా ఆమె తెలిపారు. మరోసారి - మతిస్తిమితం లేని ఆ సంచీని మరిచిపోయిందని మంత్రి అంటున్నారు. మొత్తం మీద, డబ్బు సంచీ విషయంలో సమాధానాలు చెప్పే విషయంలో పీతల సుజాత తడబడ్డారు.