Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నోటుకు ఓటు: చంద్రబాబు సమస్యను కొని తెచ్చుకున్నారా?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోటుకు ఓటు వ్యవహారంలో సమస్యను తలకు తనంత తానుగా రుద్దుకున్నారా అనే చర్చ సాగుతోంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిగా సమాన హోదాతో గౌరవించలేదనే మాట వినిపిస్తోంది. తాను ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు తన మంత్రివర్గంలో పనిచేసిన కెసిఆర్‌ను చిన్నచూపు చూశారనే విమర్శలు తెలంగాణ నుంచి వినిపించాయి.

పైగా, తెలంగాణలో తన తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. వరంగల్, మహబూబ్‌నగర్ సభల్లో కెసిఆర్‌ను సవాల్ చేశారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో కూడా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నమ్మబలికారు. టిఆర్ఎస్‌ను బలహీనపరచడానికి, కెసిఆర్‌ను తక్కువ చేయడానికి ఆయన అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారని అంటారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన రాజధాని నిర్మాణంపై, విదేశీ పర్యటనలపై పెట్టిన సమయం ప్రజల కోసం పెట్టలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. రైతుల రుణమాఫీ విషయంలోనూ, రాజధాని నిర్మాణానికి భూములను సేకరించే విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేస్తూ వస్తోంది. ఈ విమర్శలు తనకు లెక్క కాదన్నట్లు, తన క్లీన్ ఇమేజ్ తనను రక్షిస్తుందని చంద్రబాబు నమ్ముతూ వచ్చారు.

cash for vote: Chandrababu invited the trouble?

నోటుకు ఓటు కేసులో తెలంగాణకు చెందిన తన టిడిపి శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడంతో చంద్రబాబు ప్రతిష్ట మసకబారిందనే విషయం వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో తాను జరిపిన సంభాషణల టేప్ విడుదల కావడంతో చంద్రబాబు మరింతగా చిక్కుల్లో పడ్డారు. అయినా, చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను రెచ్చగొట్టే విధంగానే వ్యవహరించారని అంటున్నారు.

కెసిఆర్ ఎప్పుడూ చంద్రబాబును రాజకీయ ప్రత్యర్థిగానే భావించారు. తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయడమే కెసిఆర్ లక్ష్యంగా ఉంటూ వచ్చింది. ఈ స్థితిలో చంద్రబాబు టిఆర్ఎస్‌ను ఘోరంగా దెబ్బ తీయడానికి ప్రయత్నించారనే విమర్శలు వచ్చాయి. నోటుకు ఓటు కేసులో పట్టుబడిన రేవంత్ రెడ్డి కెసిఆర్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. కెసిఆర్‌పై, ఆయన కుటుంబంపై నిత్యం దుందుడుకు వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటూ వచ్చారు.

రేవంత్ రెడ్డికి చంద్రబాబు నుంచి ఎనలేని ప్రోత్సాహం లభించిందని అంటారు. దాంతో తెలంగాణ టిడిపిలోని సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి పట్ల గుర్రుగా ఉండడమే కాకుండా, చంద్రబాబు తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, టిఆర్ఎస్‌ను తెలంగాణలో కోలుకోకుండా దెబ్బ తీయాలని చంద్రబాబు ప్రయత్నించినట్లు చెబుతున్నారు.

ఈ వ్యవహారంతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇప్పుడు ఆయన కేంద్రంపై తీవ్రమైన ఒత్తిడి తేలేరు. వాజ్‌పేయి ప్రభుత్వంలో చంద్రబాబు కీలకమైన పాత్రనే పోషించారు. ఆ సమయంలో తన బలాన్ని చూపి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారనే విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు వల్లనే తాము తెలంగాణ ఇవ్వలేకపోయామని బిజెపి నాయకులు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే, ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అలా లేదు. ఎన్డీఎ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది. బిజెపి స్వయంగా అధికారంలో నిలబడగలిగే బలాన్ని సంతరించుకుంది. ఈ స్థితిలో చంద్రబాబు ఎన్డిఎ నుంచి వైదొలుగుతామని చంద్రబాబు బిజెపిని హెచ్చరించే పరిస్థితి కూడా లేదు. ఈ స్థితిలో చంద్రబాబు బలంగా ఉండడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మాత్రమే కాకుండా బిజెపికి కూడా ఇష్టం ఉండకపోవచ్చు. చంద్రబాబును ఎసిబి ప్రశ్నిస్తుందా, కేసులో నిందితుడిగా చేరుస్తుందా అనే ప్రశ్నలను పక్కన పెడితే రాజకీయంగా చంద్రబాబుకు నోటుకు ఓటు కేసు ఆయనను తీవ్రంగానే దెబ్బ తీసిందని చెప్పాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+