ఆ గొంతు చంద్రబాబుదే: వాయిస్ టెస్టు తప్పదా?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో బుధవారంనాడు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్ సన్తో జరిపిన సంభాషణల ఆడియో టేపులోని గొంతు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదేనని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ధ్రువీకరించినట్లు చెబుతున్నారు.
ఏ రోజున ఎన్ని గంటలకు ఎంత సేపు స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడారనే విషయాన్ని కూడా ఎఫ్ఎస్ఎల్ నివేదికలో పొందుపర్చినట్లు చెబుతున్నారు. స్టీఫెన్సన్ వ్యక్తిగత మొబైల్ ఫోన్ను పరీక్షించిన ఎఫ్ఎస్ఎల్ నిపుణులు ఈ మేరకు నిర్ధారణలు చేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఏసీబీ కోర్టుకు మెమో దాఖలు చేసిన ఎఫ్ఎస్ఎల్ తమకు కొత్త హార్డ్డిస్క్, కొన్ని ఖాళీ డీవీడీలు కావాలని కోరింది.
ఎఫ్ఎస్ఎల్ కోరినట్టు అన్నీ తాము ఇప్పటికే అందించామని ఏసీబీ వర్గాలు చెప్పాయి. కేసుకు సంబంధించి తమకు అందిన ఆడియో, వీడియో టేపులను ముందు జాగ్రత్త చర్యగా స్టోర్ చేసుకునేందుకే ల్యాబ్ అధికారులు ఇవి కోరి ఉంటారని ఏసీబీ వర్గాలు అంటున్నాయి. దాదాపుగా ఆడియో, వీడియో టేపుల విశ్లేషణ పరీక్షలు ముగిసి, నిర్ధారణలు పూర్తయ్యాయని, బుధవారం మధ్యాహ్నానికి నివేదికను ఏసీబీకి అప్పగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
నివేదిక అందిన తర్వాత ఇతర లాంఛనాలు పూర్తిచేసుకుని గురువారం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు ఎసిబి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక తమకు బుధవారం మధ్యాహ్నం లేదా గురువారానికి అందిన వెంటనే చంద్రబాబుతోపాటు ఈ కేసులో ఆరోపణలెదుర్కుంటున్న పలు ప్రైవేట్ కంపెనీల సీఈవోలు, కొంత మంది రాజ్యసభ ఎంపీలకు తాఖీదులు ఇచ్చేందుకు ఎసిబి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.