మోడీ ముందు టేప్లు, సాక్ష్యాలు: బాబుపై చర్యకు గవర్నర్కు టీ వినతి
న్యూఢిల్లీ: ఓటుకు నోటు కుంభకోణం కేసు కీలక మలుపు తిరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై చర్యకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోందని ప్రధాని నరేంద్ర మోడీకి ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తెలిపినట్లు సమాచారం. చంద్రబాబు సహా ఓ కేంద్ర మంత్రి, ఇద్దరు ఎంపీలపై చర్యకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి కోరుతోందని ప్రధానికి వివరించినట్టు చెబుతున్నారు.
ఉమ్మడి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ గురువారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఓటుకు నోటు కుంభకోణంపై దాదాపు గంటపాటు చర్చించారు. కుంభకోణానికి సంబంధించిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తనకు అందించిన సాక్ష్యాలను ప్రధాని ముందు పెట్టారని అంటున్నారు. తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడినట్టుగా బహిర్గతమైన ఆడియో టేపులు, కుంభకోణంపై తెలంగాణ సిఎం కెసిఆర్ తనతో చర్చించిన అంశాలను గవర్నర్ నరసింహన్ ప్రధానికి వివరించారు.
నోటుకు ఓటు వ్యవహారంలో ప్రధాన పాత్రధారిగా చంద్రబాబు, కేంద్ర మంత్రి, ఇద్దరు ఎంపీలపై చర్యకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి కోరుతోందని గవర్నర్ వివరించారు. బాబు మాట్లాడినట్టు చెబుతోన్న ఆడియో టేపులు, తెలంగాణ సర్కారు అందించిన ఇతర సాక్ష్యాలనూ ఆయన మోడీ ముందుపెట్టినట్టు సమాచారం. ఉమ్మడి గవర్నర్ బాధ్యతల్లో ఉన్న నరసింహన్ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న చంద్రబాబు ఆరోపణలపైనా చర్చ జరిగిందన్న మాట వినిపిస్తోంది.
చంద్రబాబుపై చర్య తీసుకోవాలన్నా, ఆయనకు నోటీసు జారీ చేయాలన్నా ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే కెసిఆర్ కొద్దిరోజుల కిందట హైదరాబాద్లో గవర్నర్ నరసింహన్తో సమావేశమైనప్పుడు చంద్రబాబుపై చర్యకు అనుమతించాలని కోరినట్టు చెబుతున్నారు. చంద్రబాబు సంభాషణల ఆడియో టేపుల్లోని నిజానిజాలపైనా ప్రధానితో గవర్నర్ సమావేశంలో చర్చ జరిగిందని అంటున్నారు.
తన టెలిఫోన్ను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందన్న చంద్రబాబు ఫిర్యాదుపైనా చర్చించారని కూడా తెలుస్తోంది. గవర్నర్ నరసింహన్ బుధవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి ఓటుకునోటు కుంభకోణం అంశాన్ని వివరించటం తెలిసిందే.
గురువారం ఉదయం తొలుత పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడిని కలిసి గవర్నర్ సమాలోచనలు జరిపారు. ఓటుకు నోటుపై గవర్నర్ నరసింహన్ అందించిన నివేదికను హోంశాఖ పరిశీలించి అభిప్రాయం వ్యక్తం చేసిన తరువాతే ఎన్డీయే ప్రభుత్వం ఈ అంశంపై ఒక నిర్ణయానికి వస్తుందన్న వాదన వినిపిస్తోంది.
రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన గవర్నర్ నరసింహన్ కుంభకోణం వ్యవహారంపై మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడాది పాలన పూర్తి, ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులపైనే కేంద్రానికి నివేదిక అందించానని చెబుతున్నారు. ఓటుకు నోటు కుంభకోణంపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలూ చేయడం లేదు. ప్రధానితో భేటీ అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైన గవర్నర్ నరసింహన్ ఓటుకు నోటు కుంభకోణం వ్యవహారాన్ని వివరించారు.