టిడిపి నేత కన్నా హత్య వెనక ప్రేయసి: నిందితుల ఆత్మహత్య
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ కార్యదర్శి పడాల కన్నారావు మృతి కేసులో నిందితులుగా భావిస్తున్న కల్యాణి, అనిల్ ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడ టీడీపీ అర్బన్ కార్యదర్శి పడాల కన్నారావు మే 25న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తొలుత సాధారణ మరణంగా భావించారు.
అయితే కన్నారావు భార్య, తల్లిదండ్రులు, టీడీపీ కార్యకర్తలు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిరుడు మృతి చెందిన మరో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉమ్మడి శ్రీనివాస్ భార్య కల్యాణియే ఈ హత్యకు కారణమని, డబ్బు కోసం, వివాహేతర సంబంధం గురించి ఆమె హత్య చేయించిందని అనుమానాలు బయటపడ్డాయి.
పైగా, ఉమ్మడి శ్రీనివాస్ను సైతం భార్య కల్యాణినే హత్య చేయించిందని, అనంతరం శ్రీనివాస్ స్నేహితుడైన కన్నారావుతో వివాహేతర సంబంధం కొనసాగించిందని కన్నారావు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. శ్రీనివాస్ మరణం తర్వాత జరిగిన సంస్మరణ కార్యక్రమానికి ప్రస్తుతం తెలంగాణ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాసయాదవ్ హాజరై రూ. పది లక్షల ఆర్థిక సహాయం అందజేస్తానని ప్రకటించారు.

అయితే ఈ డబ్బులో రూ. 5 లక్షలు ఇవ్వాలని అడిగినందుకు కల్యాణి తన ఇంటి వెనుక నివసించే అనిల్తో కలిసి కన్నాను చంపించే ప్లాన్ వేసిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. అయితే కన్నారావు మరణించిన తర్వాత రోజు వారిని పిలిపించి సున్నితంగా ప్రశ్నలు అడిగి పంపించడంతో వారు పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇలా తప్పించుకుని తిరుగుతున్న కల్యాణి, అనిల్, కల్యాణి కుమారుడు బుధవారం తమిళనాడు రాష్ట్రంలోని నాగర్కోయిల్ వద్ద ఉన్న ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. మొదట తన కుమారుడిని చంపిన కల్యాణి అనంతరం ప్రియుడు అనిల్తో కలిసి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications