విజయవాడకు ఆ లక్షణాలు లేవు, రావాలంటేనే ఇబ్బంది, తెలంగాణలో ఆ సమస్య లేదు: పవన్
హైదరాబాద్: విజయవాడలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరోసారి కులాల ప్రస్తావన తీసుకొచ్చారు. తెలంగాణలో కులం సమస్య లేదని, ఇక్కడెందుకు కొట్టుకు చస్తారని? ప్రశ్నించారు.
కులాల మధ్య ఐక్యత ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అయినంత మాత్రానా.. తననను ఆ ఒక్క కులానికి పరిమితం చేయాలనుకుంటే ఎవరినీ ఉపేక్షించనని మరోసారి స్పష్టం చేశారు.

విజయవాడకు రావడం ఇబ్బంది:
అదే సమయంలో అభిమానుల అత్యుత్సాహంపై కూడా పవన్ స్పందించారు. అభిమానం ఉండాలి కానీ, ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని అన్నారు. విజయవాడ రావడం తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందన్నారు.
'విజయవాడ వస్తే.. బాబులకి బాబు కల్యాణ్ బాబు అంటూ నినాదాలు చేస్తారు. ఇవన్నీ నాకు నచ్చవు. దాంట్లో ఏముంది?' అంటూ అసహనం వ్యక్తం చేశారు. అభిమానం ప్రజలు ఇరిటేట్ అయేలా ఉండకూడదని, ఆనందింపజేసేలా ఉండాలని అన్నారు.

విజయవాడకు ఆ లక్షణాలు లేవు:
విజయవాడకు ఇంకా బలమైన ఆలోచన రావాల్సిన అవసరముందన్నారు. విశ్వనగరానికి ఉండాల్సిన లక్షణాలు విజయవాడకు ఇంకా లేవని, నేర్చుకోవాలని సూచించారు. తనకు ఆవేశం ఉంటుందని, అది ఆలోచనతో కూడిన ఆవేశమే తప్ప ఆలోచన లేనిది కాదని గుర్తుచేశారు. మీ అందరి కోసం ఇలాంటి వర్క్ షాప్స్ మరిన్ని పెడుతానని అన్నారు.

నిరాయుధుడిని చంపడం తప్పు:
విజయవాడలో ప్రజలు కులాల ఉచ్చులో ఇరుక్కుపోతున్నారని పవన్ అభిప్రాయపడ్డారు. వంగవీటి రంగా చనిపోయినప్పుడు ఉన్నది కూడా బాబు ప్రభుత్వమేనని చెప్పారు. నిరాయుధుడిగా ఉన్న వాడిని చంపడం తప్పని పేర్కొన్నారు. కాపు, కమ్మ, బీసీ, దళిత అంటూ ఇటువంటివి పెట్టుకుంటే అభివృద్ధి జరగదని తెలిపారు.

శనివారం ఒంగోలు పర్యటన:
ఉత్తరాంధ్ర, విజయవాడ పర్యటనలను పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్.. 9వ తేదీన ఒంగోలులో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 11గం.కు కృష్ణానది పడవ మునకలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. అనంతరం ఒంగోలు ఆర్డీవో కార్యాలయం ఆవరణలోని ఎన్టీఆర్ కళాక్షేత్రం ఆవరణలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications