సాయిరెడ్డికి భారీ షాక్: 3రోజులే గడువు -బెయిల్ రద్దు కేసులో సీబీఐ కోర్టు నోటీసులు -రెబల్ ఎంపీ రఘురామ సంచలనం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మళ్లీ జైలుకు పంపేదాకా ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టబోనని శపథం చేసిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ పనిలో చివరి అంకానికి చేరిన వెంటనే, జగన్ కేసుల్లో సహ నిందితుడైన ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుకూ ప్రయత్నాలు ఆరంభించడం తెలిసిందే. శపథాన్ని అప్ డేట్ చేసుకుంటూ, ఏ1 జగన్, ఏ2 సాయిరెడ్డి ఇద్దరినీ జైలుకు పంపుతానన్న రెబల్ ఎంపీకి ఇంకాస్త ఉత్సాహమిచ్చేలా, వైసీపీ శిబిరానికి, ప్రత్యేకించి విదేశీ పర్యటనకు వెళ్లాలనుకుంటోన్న విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు భారీ షాకిచ్చింది..

సాయిరెడ్డికి కోర్టు నోటీసులు
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టమెంటరీ పార్టీ నేత, అధినేత సీఎం జగన్ తర్వాత పార్టీలో రెండో శక్తిమంతమైన నేత అయిన రాజ్యసభ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ రద్దు పిటిషన్ కు సంబంధించి ఆయనకు హైదరాబాద్ సీబీఐ కోర్టు శనివారం నాడు నోటీసులు జారీ చేసింది. క్విడ్ ప్రోకో సంబంధిత చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్న సాయిరెడ్డి తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడుతున్నందున బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ ఈనెల 3న పిటిషన్ వేయగా, దానిని కోర్టు విచారణకు స్వీకరించింది. రఘురామ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సాయిరెడ్డితోపాటు సీబీఐని కూడా కోర్టు ఆదేశించింది..

3రోజులే గడువిచ్చిన కోర్టు..
ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై ఈనెల 25న తీర్పు వెలువడనుండగా, గత వారం వాదనలు ముగిసిన సందర్భంలో సాయిరెడ్డి బెయిల్ రద్దుకు కూడా పిటిషన్ వేయనున్నట్లు ఎంపీ రఘురామ చెప్పడం, ఆ మేరకు దాఖలైన కేసును సీబీఐ కోర్టు విచారణకు తీసుకోవడం చకాచకా జరిగిపోయాయి. కాగా, రఘురామ వేసిన బెయిల్ రద్దు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి సాయిరెడ్డి, సీబీఐలకు కోర్టు కేవలం 3రోజులే గడువిచ్చింది. ఈనెల 10న తదుపరి విచారణ ఉంటుందన్న కోర్టు.. ఆ లోపే విజయసాయిరెడ్డి, సీబీఐలు తమ ప్రతివాదనలు దాఖలు చేయాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. అసలు..

విజయసాయి బెదిరింపులు.. ఇవిగో సాక్ష్యాలు..
వైసీపీలో నంబర్ 2 నేత అయిన విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ లో సంచలన అంశాలను పేర్కొన్నారు. వైసీపీ పార్లమెంటరీ నేత హోదాలో ఎంపీ విజయసాయిరెడ్డి నిత్యం కేంద్ర హోం, ఆర్థిక శాఖ కార్యాలయాల్లో కలియదిరుగుతూ.. తనకు కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలున్నాయనే విధంగా చిత్రీకరించి.. జగన్ కేసుల్లో సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారని రఘురామ ఆరోపించారు. అంతేకాదు, విజయసాయిరెడ్డి ఎంపీ కాగానే .. సీఎం జగన్ ఆస్తుల కేసుల ప్రధాన దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన అధికారిని సీబీఐ జేడీ చేయవద్దని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారని, ఇది స్వేచ్ఛాయుత విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని, మాన్సాస్ వివాదంలో అశోక్ గజపతిరాజును జైలుకు పంపుతామని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం కూడా కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందన్న రఘురామ.. వీటికి సంబంధించిన సాక్ష్యాధారాలను పిటిషన్ కు జత చేసినట్లు తెలుస్తోంది.

విదేశాలకు పారిపోయే ప్లాన్..
ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి రెబల్ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్న మరో అంశం.. విదేశాలకు పారిపోవడం. టీడీపీ అనుకూల మీడియా అధినేతలతో ఎంపీ రఘురామ హవాలాకు పాల్పడ్డారని, ఆయన పవర్ ప్రాజెక్టుల్లో ఆర్థిక అవకతవకలపైనా సీబీఐ కేసులున్నాయని, ఎంపీగా అనర్హత వేటు పడిన పడిన వెంటనే రఘురామ విదేశాలకు పారిపోయేందుకు పక్కాగా ప్లాన్ వేసుకున్నారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి గతంలో ఆరోపించారు. అయితే, విదేశాలకు పోవాలనుకుంటున్నదని తాను కాదని, ఎంపీ విజయసాయిరెడ్డే పాస్ పోర్టు కోసం కేంద్రం చుట్టూ చక్కర్లు కొడుతున్నారని రెబల్ రఘురామ కౌంటరిచ్చారు. విదేశాలకు పారిపోయిందుకు విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారని.. అందుకే ఆయన బెయిల్ రద్దు చేయాలనీ పిటిషన్ లోనూ పేర్కొన్నారు. ఈ క్రమంలో..

తప్పుడు సలహాలు.. తన్నులు..
విజయసాయిరెడ్డిపై విమర్శల పర్వంలో రఘురామ కొన్ని అసాధారణ విషయాలు చెప్పుకొచ్చారు. ''నాపై అనర్హతవేటు పడుతుందని, విదేశాకు పారిపోతానని ఏ2 సాయిరెడ్డి నోటికొచ్చినట్లు పేలుతున్నాడు. అతనికేమైనా పిచ్చెక్కిందా? అంటే, ఎక్కే ఉంటది. ఎందుకంటే, అన్ని చోట్లా ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి టెన్షన్ పెరిగిపోయి ఉండొచ్చు. అంతేకాదు, ఈ మధ్య సాయిరెడ్డికి దేహశుద్ధి కూడా జరిగినట్లు తెలిసింది. సాయిరెడ్డిని కొట్టింది ఎవరో ఆ దేవుడికే తెలియాలి. అతనొక క్రిమినల్. ఎప్పుడూ తప్పుడు సలహాలే ఇస్తుంటాడు, గతంలో నాక్కూడా అలాంటి సలహాలే ఇచ్చాడు..'' అని రఘురామ గతంలో వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే,
Recommended Video

జగన్ బెయిల్ రద్దు లాగే సాగదీస్తారా?
రెబల్ ఎంపీ రఘురామ తాను చెప్పిన విధంగా జగన్ బెయిల్ రద్దుకు తీవ్రంగా పోరాడటం, ఆ క్రమంలో సీబీఐపైనా సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. సీబీఐ అధికారులకు జగన్ తాయిలాలు ఇచ్చారని, అందుకే దర్యాప్తు సంస్థ కనీసం కౌంటర్ కూడా ఫైల్ చేయలేదని, పైగా లిఖిత పూర్వక వాదనల్లోనూ వాయిదాలు కోరుతూ కేసును కావాలనే సాగదీసిందని రఘురామ గతంలో ఆరోపించారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ అంశంలోనూ సాగదీతల పర్వం కచ్చితంగా ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం(7న) జారీ అయిన నోటీసులకు మూడు రోజుల్లోగా, అంటే, మంగళవారం(10వ తేదీ)లోగా కౌంటర్ సిద్ధం చేయడం ఆలస్యమయ్యే క్రమంలో సాయిరెడ్డి, సీబీఐలు కోర్టును మరింత గడువుకోరే అవకాశాలున్నాయి. ఈ లోపే జగన్ బెయిల్ రద్దుపై తీర్పు వెలువడితే ఉదంతం మరో మలుపు తిరుగుతుంది..












Click it and Unblock the Notifications